indian railways: నంబర్లు మార్చుడు.. ఛార్జీలు బాదుడు!

ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను వంద శాతం పునరుద్ధరించిన ద.మ.రైల్వే.. సామాన్యులు ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్ల విషయంలో

Published : 07 Oct 2021 11:17 IST

నంబర్లు మార్చి, ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ
కొవిడ్‌ నంబర్లతో కొత్త కాలపట్టిక
ద.మ.రైల్వే తీరుపై విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను వంద శాతం పునరుద్ధరించిన ద.మ.రైల్వే.. సామాన్యులు ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. కొవిడ్‌ రాకముందుతో పోల్చితే ఇప్పటి వరకు 30 శాతం ప్యాసింజర్లనే పునరుద్ధరించింది. పలు రైళ్లను క్రమక్రమంగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తూ ఛార్జీలను పెంచుతోంది. అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త కాలపట్టికలో 22 ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. దీంతో రూ.10 ఉండే కనీస ఛార్జి రూ.30కి పెరిగింది. ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు పరిశీలిస్తే.. ఛార్జీలు దాదాపు రెట్టింపయ్యాయి. ఆ లెక్కన రైళ్ల వేగం పెరిగిందా అంటే.. అదీ లేదు. కొన్ని రైళ్లు పాత సమయం ప్రకారమే గమ్యస్థానాలు చేరుకుంటుండగా.. మరికొన్ని ఐదు, పది నిమిషాల ముందు మాత్రమే చేరుకుంటున్నాయి. ప్రత్యేక రైళ్ల పేరుతో కరోనా కాలం నుంచి రాయితీ ప్రయాణాలకు రాంరాం చెప్పిన ఈ శాఖ.. ఏడాదికోసారి అమలులోకి తీసుకొచ్చే కొత్త టైంటేబుల్‌లో ఈ రైళ్లకు కొవిడ్‌ నంబర్లనే కేటాయించింది. దీని ప్రకారం అవి ఇప్పట్లో రెగ్యులర్‌ రైళ్లుగా పట్టాలు ఎక్కే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా.. సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత భారం కానుంది.

ఆదాయమే ప్రధానం..!

రైల్వే శాఖ ఆదాయమే ప్రధానం అన్న ధోరణిని కనబరుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్యాసింజర్ల నుంచి తక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కువ స్టేషన్లలో ఆపడం వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తోంది. ఆరు ఎక్స్‌ప్రెస్‌లను సూపర్‌ఫాస్ట్‌లుగా, 22 ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినట్లు కొత్త టైంటేబుల్‌లో తెలిపిన ద.మ.రైల్వే.. అందులోని రైళ్ల నంబర్లనూ మార్చి టికెట్‌ ఛార్జీలను పెంచేసింది. గుంటూరు-కాచిగూడ రైలు నం.77981ను 07269గా, హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ రైలు నం.57549ను 07049గా, సికింద్రాబాద్‌-మణుగూరు రైలు నం.17025ను 02745గా, కాకినాడ-భావ్‌నగర్‌ నం.17203ను 02699గా మార్చింది. జనరల్‌ బోగీల టికెట్‌ ఛార్జీలు కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు రూ.25 నుంచి రూ.50కి, నర్సాపూర్‌ నుంచి గుంటూరుకు రూ.35 నుంచి రూ.70కి, భద్రాచలం నుంచి సిర్పూర్‌ టౌన్‌కు రూ.65 నుంచి 120కి, హైదరాబాద్‌ నుంచి పూర్ణ వరకు రూ.80 నుంచి రూ.150కి పెరిగాయి. ఇలా.. ద.మ. రైల్వే శాఖ ఛార్జీలను పెంచడం పట్ల ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని