Warangal: వరంగల్కు వచ్చే ఏడాది నుంచి విమానాలు తిరగాలి!
రాష్ట్రంలో తొలిదశలో మూడు ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు ప్రాంతీయ విమానాశ్రయాలపై ఈ నెలాఖరుకు తుది నివేదిక కోరిన రాష్ట్రం
ఏఏఐ జాప్యంపై అసహనం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశలో మూడు ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ఈ నెలాఖరులోగా తుది నివేదిక ఇవ్వాలని పౌర విమానయాన సంస్థ(ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఏఏఐ)కు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడాన్ పథకం కింద 6 ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. తొలిదశలో మామునూరు(వరంగల్), జక్రాన్పల్లి(నిజామాబాద్), బసంత్నగర్(పెద్దపల్లి)లపై దృష్టిపెట్టింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి తీసుకువచ్చి విమానాలు నడపాలని భావిస్తోంది. మామునూరు, బసంత్నగర్లలో రన్వేకు అవసరమైన ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి. వినియోగంలో లేక దెబ్బతిన్నాయి. జక్రాన్పల్లిలో పూర్తిస్థాయిలో నిర్మించాల్సి ఉంది. రెండో దశలో ఖానాపూర్(ఆదిలాబాద్), గొల్లగూడెం-పేటచెరువు(భద్రాద్రి-కొత్తగూడెం), గుడిబండ(మహబూబ్నగర్)లపై నివేదికలు ఇవ్వాలని రాష్ట్రం కోరింది. ఈ ఆరింటికి సంబంధించి ఏఏఐ గతంలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి రద్దీ అంతగా ఉండని కారణంగా దశలవారీగా వాటిని విస్తరించేలా అంచనా వ్యయాలను సవరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.400-450 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఏఏఐ నుంచి నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించి నిధులు కోరాలని అధికారులు యోచిస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆశించినంత వేగంగా స్పందన రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకింత అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ.. ఏఏఐ ఛైర్మన్ సంజీవ్కుమార్తో మాట్లాడినట్లు తెలిసింది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.