మీడియాలో లింగ వివక్షపై ఫిబ్రవరి 3న ఐఏఏ సదస్సు

మీడియా రంగంలో లింగ వివక్షను నిర్మూలించే ఉద్దేశంతో ఐఏఏ ఫిబ్రవరి 3న సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ టీహబ్‌లో జరిగే ఈ సదస్సుకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

Updated : 25 Jan 2023 19:01 IST

హైదరాబాద్‌: మీడియా రంగంలో లింగ వివక్షను పోగొట్టేందుకు ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) నడుం బిగించింది.  ఇందులో భాగంగా మీడియాలో జెండర్‌ సెన్సిటైజేషన్‌ అనే అంశంపై సదస్సు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగే ఈ సమ్మిట్‌కు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మీడియాలో నెలకొన్న లింగ వివక్షను రూపుమాపాల్సిన ఆవశ్యకతపై  ఆ రంగంలో ప్రముఖ వక్తలు ప్రసంగాలు చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు యూనిసెఫ్‌ నాలెడ్జ్‌ భాగస్వామిగా ఉండనుందని ఐఏఏ ఓ ప్రకటనలో తెలిపింది. 

గతేడాది సెప్టెంబర్‌లో యునిసెఫ్‌తో కలిసి గీనా డావిస్ ఇన్‌స్టిట్యూట్‌ జరిపిన అధ్యయనంలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా లింగ వివక్షను నిర్మూలించేందుకు, వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు ఐఏఏ చొరవ తీసుకుంది. ఆ అధ్యయనం ప్రారంభించడంతో గతేడాది సెప్టెంబర్‌లో IAA -ఇండియా సమర్థవంతమైన మార్పు దిశగా తొలి అడుగు వేసింది. ఇది ప్రకటనలు, కమ్యూనికేషన్‌ రంగంలో లింగ వివక్షత సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించి చేసిన అధ్యయనం. ఈ అధ్యయనంలో వెయ్యికి పైగా ప్రకటనల్ని మూల్యాంకనం చేయగా.. మీడియా రంగంలో లింగ వివక్ష తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా ఉన్నట్టు పేర్కొంది. మహిళలు, ఇతర జెండర్‌ల పట్ల  ఏ విధంగా చూస్తారనే అంశంలో చేదు నిజాలు బహిర్గతమయ్యాయి. ఇలాంటి సంచలనాత్మక పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో పంచవ్యాప్తంగా Voice of Change: Gender Portrayal from 30 seconds to 3 hours పేరిట సదస్సులు నిర్వహించి ప్రజల దృష్టికి  ఇలాంటి అంశాలను తీసుకెళ్లడం, వారి విజ్ఞానాన్ని పెంచాలన్న సామాజిక బాధ్యతతో ఈ సంస్థ చొరవ తీసుకుంది. 

ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. IAAలో కార్పొరేట్ మెంబర్స్‌, ఆర్గనైజేషనల్ మెంబర్స్‌, విద్యా అనుబంధ సంస్థలతో పాటు 76 దేశాల నుంచి  అనేక మంది సభ్యులతో కూడిన అసోసియేషన్‌. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని