Kamareddy: కాసుల కోసం కక్కుర్తి.. ఏ తల్లికి రాకూడదీ దుస్థితి!

ఆస్తి పంపకాలు చేయలేదని, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము ఇవ్వలేదని కన్నతల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.

Updated : 07 May 2023 16:41 IST

సొమ్మే శాపమైంది. అయిన వారున్నా ఆదరణ కరవైంది. ముగ్గురు సంతానాన్ని పెంచి పెద్ద చేసి.. బాధ్యతల భారాన్ని మోసిన కిష్టవ్వకు ఎంత కష్టమొచ్చింది. కృష్ణా..రామా.. అంటూ కాలం వెళ్ల దీయాల్సిన వయసులో.. కన్నవారు గాలికొదిలేశారు. అస్తి పంచివ్వలేదని అనాథగా వదిలేశారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతూ ఆ వృద్ధురాలు ఆసుపత్రిలోనే కన్నుమూసింది. సభ్య సమాజంలో వస్తున్న విపరీత పోకడలకు కిష్టవ్వ ఉదంతం ఓ ఉదాహరణగా నిలుస్తోంది.    

కామారెడ్డి (నేర విభాగం): జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాలు చేయలేదని, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఇవ్వలేదని కన్నతల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించిన ఘటన కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం జరిగింది. దీంతో అయిన వారు ఉన్నప్పటికీ కిష్టవ్వ అనాథగా మిగిలిపోయింది.

అసలేం జరిగిందంటే?

కామారెడ్డిలోని ఆర్‌బీ నగర్‌కు చెందిన కిష్టవ్వ (70)కు ముగ్గురు కుమార్తెలు కాగా.. ఇటీవల ఒక కుమార్తె చనిపోయింది. వీరంతా కామారెడ్డి పట్టణంలోనే నివసిస్తున్నారు. కిష్టవ్వ పేరుమీద  ఓ ఇల్లు, బ్యాంకు ఖాతాలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. ఆమె ఆస్తులకు సంబంధించి దగ్గరి బంధువు ఒకరు నామినీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డబ్బులను తమకు ఇవ్వాలంటూ ఇద్దరు కుమార్తెలు తల్లిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కిష్టవ్వ అనారోగ్యానికి గురవ్వగా.. గత నెల 21న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మృతి చెందింది.

కిష్టవ్వ మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బతికి ఉన్నప్పుడు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బులు తమకు ఇవ్వలేదని, అందుకే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుమార్తెలిద్దరూ రాలేదని ఆసుపత్రి సిబ్బందికి తెలిసింది. దీంతో చేసేదేమీ లేక ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని శవాగారంలో ఉంచారు. బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం పలువురు హృదయాల్ని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికెళ్లి విచారణ చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని