TSPSC: టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌.జగదీశ్వర్‌ రెడ్డి

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎగ్జామినర్‌గా ఎన్‌.జగదీశ్వర్‌రెడ్డిని నియమించింది.

Published : 12 May 2023 18:31 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్.జగదీశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్‌డీగా ఉన్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన జగదీశ్వర్‌రెడ్డి రెండేళ్లు టీఎస్‌పీఎస్సీలో కొనసాగనున్నారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కమిషన్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, జవాబుదారీతనం పెంచి, నియామక ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేసేందుకు సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల అదనంగా పది పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా పీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఉండాలని యూపీఎస్సీ గతంలోనే సిఫార్సు చేసింది. ఈ పోస్టులో ఐఏఎస్‌ అధికారిని నియమించాలని, ఆయన సొంత రాష్ట్రానికి చెందకూడదని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టులను సృష్టించారు. తమకు సైతం ఈ పోస్టును మంజూరు చేయాలని టీఎస్‌పీఎస్సీ గతంలోనే ప్రభుత్వానికి విన్నవించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌, అదనపు కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి బీఎం సంతోష్‌ను నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌.జగదీశ్వర్‌ రెడ్డి నియమించింది.

కొత్తగా 10 పోస్టుల మంజూరు

భవిష్యత్తులో పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలు ఉండటంతో టీఎస్‌పీఎస్సీలో సైబర్‌ సెక్యూరిటీకి కమిషన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు ఐటీ ప్రొఫెషనల్స్‌తో శాశ్వత పోస్టులను భర్తీ చేయనుంది. వాటిలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి నుంచి జూనియర్‌ ప్రోగ్రామర్‌ వరకు ఆరు పోస్టులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు ముగ్గురు ప్రత్యేక అధికారులు ఉంటారు. నిర్వహణ బాధ్యత పూర్తిగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌దే. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సైతం పరీక్షల కంట్రోలర్‌ పరిధిలోనే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని