
కాకర్ల సుబ్బారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు.
నిమ్స్ అభివృద్ధికి విశేష కృషి..
1970లో సుబ్బరావు మళ్లీ అమెరికా వెళ్లారు. యునైటెడ్ కింగ్డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని అనేక అసుపత్రులలో పనిచేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. 1986లో ఎన్టీ రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ నిమ్స్లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్ను తీసుకొచ్చారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు, జర్నల్స్లో పరిశోధనా వ్యాసాలు రాసిన డాక్టర్ కాకర్ల దేశ.. విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. 50 ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సత్కారాలు పొందారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు.
కాకర్ల సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్
నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు కాకర్ల సుబ్బారావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరెక్టర్గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాకర్ల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు: చంద్రబాబు
ప్రముఖ వైద్యుడు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘50 ఏళ్లకు పైగా వైద్య సేవలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. నేటి యువతకు కాకర్ల సుబ్బారావు ఆదర్శం. కాకర్ల పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.