KTR: 9ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం.. ఇప్పటికీ ఒప్పుకోలేదు: కేటీఆర్‌

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40పైసలే తిరిగి వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు...

Updated : 23 Jun 2023 14:50 IST

దిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40పైసలే తిరిగి వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎదుగుతున్న రాష్ట్రానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు.

‘‘తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోంది. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ భూముల గురించి కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. రక్షణశాఖ భూములున్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. సికింద్రాబాద్‌లో అభివృద్ధి పనులకు సహకరించాలని కోరాం. రక్షణశాఖ ఇచ్చే స్థలాలకు సమానమైన భూమిని మరోచోట ఇస్తాం. కేంద్రం సంబంధిత భూములిస్తే.. ప్రజోపయోగ పనులకు వాడతాం. దీనిపై తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం.. ఇప్పటికీ ఒప్పుకోలేదు. రాజీవ్‌ రహదారిపై స్కైవేల నిర్మాణానికి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం’’ అని కేటీఆర్‌ చెప్పారు.

మెట్రో రైలు విస్తరణకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు కేటీఆర్‌ తెలిపారు. కొత్తగా 31కి.మీ. మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నామన్నారు.‘‘లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లో కంటోన్మెంట్‌ భూములు మెట్రో కోసం ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మెట్రో ప్రాజెక్టులకు సహకరించారు. అహ్మదాబాద్‌కు భారీగా నిధులిచ్చి హైదరాబాద్‌కు ఇవ్వలేదు. ఎంఎంటీఎస్‌ విస్తరణకు రాష్ట్ర వాటా నిధులు కేటాయించాం. ప్రజారవాణా కోసమే జరుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలి. సహకరించకుంటే కేంద్రం వైఖరిని ప్రజల్లో ఎండగడతాం. రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని