Top Ten News @ 9 AM

తమిళనాడులో ఈ ఉదయం విషాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా బాధితులు మృతిచెందారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో

Updated : 05 May 2021 09:01 IST

1. Oxygen అందక 11 మంది మృతి

తమిళనాడులో ఈ ఉదయం విషాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా బాధితులు మృతిచెందారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో ఎక్కడ లోపం తలెత్తిందో తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీలో 18 గంటల కర్ఫ్యూ

ఏపీలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నేటి నుంచి ఈనెల 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్‌ విధిస్తారు.  వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసివేయాలి. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌లు, ఔషధ దుకాణాలతోపాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కరోనాను జయించిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం మంగళవారం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది. ఆర్టీపీసీఆర్‌, యాంటిజెన్‌ పరీక్షలు రెండింటిలోనూ నెగెటివ్‌గా నివేదికలు వచ్చాయి. రక్త పరీక్షలు చేయగా అవి కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. సీఎం పూర్తిస్థాయిలో కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. బుధవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనవచ్చని వైద్యబృందం సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పిండేస్తున్న ఆసుపత్రులు

కరోనా సోకి ప్రాణాలు దక్కించుకొనేందుకు ఎక్కడ ఆక్సిజన్‌ సౌకర్యం ఉండే బెడ్‌ దొరుకుతుందో, ఎక్కడ ఐసీయూ సౌకర్యం ఉందోనని పరుగులు పెడ్తున్న నిస్సహాయులను ప్రైవేటు ఆసుపత్రులు నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. ముందుగా రూ.లక్ష డిపాజిట్‌ చేస్తేనే వారికి ఆయా ఆసుపత్రులు చికిత్సను ప్రారంభిస్తున్నాయి. రోగనిర్ధారణ పరీక్షలు, స్కానింగులు, ఎక్స్‌రేలు, ఔషధాలు, ఇంజక్షన్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, ఐసీయూలు, అంబులెన్స్‌లు, పడకలు, వివిధ రకాల సేవల పేరిట రుసుములు వేసి రూ. 2 లక్షల నుంచి రూ.15 లక్షలు లేదా అంత కంటే ఎక్కువగానే  వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆస్తులను తెగనమ్ముకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. చాపకింద నీరులా డబుల్‌ మ్యుటెంట్‌

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరగడానికి డబుల్‌ మ్యుటెంట్‌ వైరసే కారణమని అంటున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొవిడ్‌ రెండో ఉద్ధృతి మార్చి నెల మధ్యలో మొదలైంది. దాదాపు నెలన్నరపైగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గుర్తించారు. కొత్తగా వస్తున్న కేసుల్లో సగం వరకు బి.1.617 వైరస్‌ (డబుల్‌ మ్యుటెంట్‌) రకమే ఉండడంతో ఇతర రాష్ట్రాల డాటాతో పోల్చి చూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అందరికీ టీకా ఎంత దూరం..

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన 80 కోట్లమందికి టీకా అందించడానికి ఎంత కాలం పడుతుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మదిని తొలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు దాటినవారు 60%మంది ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర వైద్యారోగ్యశాఖ పరిగణనలోకి తీసుకున్న లెక్క ప్రకారం (దేశ జనాభా 135,69,78,000) 81.41 కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.5,895.75 కోట్లతో సీరం, భారత్‌ బయోటెక్‌లకు కలిపి 34.6 కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

7. భాజపాను దెబ్బతీసిన మైనారిటీలు, మహిళలు

భారతీయ జనతా పార్టీ విజయ పరంపరకు చక్రాల కుర్చీలోని ఓ మహిళ ఒంటరిగా అడ్డుకట్ట వేయగలిగిందా? లేకపోతే, పశ్చిమ్‌ బంగలో కాషాయదళం అధికారంలోకి వస్తే తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్న అల్పసంఖ్యాక వర్గాల భయమే దీనికి కారణమా? అవును... ఈ రెండో వాదనే వాస్తవం. మైనారిటీలందరూ తృణమూల్‌ కాంగ్రెస్‌ వెనకే నిలబడ్డారు. ఇతర ప్రధాన లౌకిక పార్టీలన్నింటినీ విడిచిపెట్టి, గంపగుత్తగా టీఎంసీకే ఓట్లేశారు. భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయన్న నమ్మకమే మైనారిటీ ప్రజలను ఏకతాటిపై నడిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. వాణిజ్య బంధం బలోపేతం

భారత్‌తో తమ సంబంధాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. ఇరు దేశాల సంబంధాలను సమున్నత స్థితికి తీసుకువెళ్లేందుకు ఇరుదేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు 100 కోట్ల పౌండ్ల (సుమారు రూ.10,230 కోట్లు)కు చేరుకుంటాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆపత్కాలం యాప్‌లు!

కరోనా కష్టకాలంలో పలు యాప్స్‌ ఎంతో మేలు చేస్తున్నాయి. అన్నిరకాలుగా ఉపయోగపడే సర్వీసులు అందిస్తున్నాయి. ఇవి ఫోన్‌లో ఉంటే ఆపత్కాలంలో మనకు, సన్నిహితులకు మంచిది. కాలర్‌ ఐడీ సర్వీస్‌ ప్రొవైడర్‌ ‘ట్రూ కాలర్‌’ దేశంలోని మొత్తం ఆసుపత్రుల జాబితాను సిద్ధం చేసింది. నిన్నటిదాకా జంటల్ని కలిపిన డేటింగ్‌ యాప్‌ ట్రూలీ మ్యాడ్లీ ఇప్పుడు ప్లాస్మా అవసరమై ఆపదల్లో ఉన్నవారు, ప్లాస్మా దాతల్ని కలిపే వేదికగా మారిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బీసీసీఐకి రూ.2200 కోట్లు నష్టం!

ఐపీఎల్‌ నిరవధిక వాయిదాతో బీసీసీఐ భారీగా నష్టపోనుంది. సుమారు రూ.2200 కోట్లు నష్టం వాటిల్లనున్నట్లు అంచనా. ‘‘ఐపీఎల్‌ను అర్ధంతరంగా వాయిదా వేయడంతో మేం రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు నష్టపోవచ్చు. సుమారు రూ.2200 కోట్లు నష్టపోతామని అనుకుంటున్నాం’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగాల్సిన ఐపీఎల్‌ కరోనా మహమ్మారి కారణంగా మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటి వరకు 24 రోజుల్లో 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని