మరో రెండు నగరాల్లోనూ రాత్రి కర్ఫ్యూ

తగ్గినట్టే కనిపించిన కరోనా వైరస్‌ మళ్లీ కోరలు చాస్తోంది. టీకా పంపిణీ కొనసాగుతున్నా భారీగా  కేసులు నమోదవుతుండటంతో మహమ్మారి విజృంభణ పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి..........

Updated : 17 Mar 2021 13:22 IST

భోపాల్‌: తగ్గినట్టే కనిపించిన కరోనా వైరస్‌ మళ్లీ కోరలు చాస్తోంది. టీకా పంపిణీ కొనసాగుతున్నా భారీగా  కేసులు నమోదవుతుండటంతో మహమ్మారి విజృంభణ పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొవిడ్‌ను అదుపులో పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా నిబంధనల్ని కఠినతరం చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌.. రాష్ట్రంలో కీలక నగరాలైన భోపాల్‌తో పాటు ఇండోర్‌లోనూ రాత్రి కర్ఫ్యూ విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు బుధవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

అయితే, భోపాల్‌, ఇండోర్‌లో రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికీ ఈ ఆంక్షలు ఎంత కాలం అమల్లో ఉంటాయన్నది మాత్రం అధికారులు ప్రత్యేకంగా చెప్పలేదు. మరోవైపు జబల్‌పూర్‌, గ్వాలియర్‌, ఉజ్జయిని‌, రత్లాం, చింద్వారా, బుర్హన్‌పూర్‌, బేతుల్‌, ఖార్గోన్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత అన్ని రకాల దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు గుమిగూడే కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు తెగేసి చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు పండుగను కుటుంబాలతో ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌తో పాటు వారం ఐసోలేషన్‌ యథావిథిగా అమలువుతుందని పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో సోమవారం 797 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 2,69,391 మందికి కొవిడ్ సోకగా.. వారిలో 3,890 మంది మృత్యువాతపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని