Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు

పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఏపీ మాజీ మంత్రి పొంగూరి నారాయణ బెయిల్‌ రద్దయింది. ఈమేరకు చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 31 Oct 2022 13:53 IST

చిత్తూరు: పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఏపీ మాజీ మంత్రి పొంగూరి నారాయణ బెయిల్‌ రద్దయింది. ఈమేరకు బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. నవంబర్‌ 30లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆయన్ను ఆదేశించింది. ఈ కేసులో నారాయణకు బెయిల్‌ ఇవ్వడం సమంజసం కాదని.. రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై చిత్తూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌ నుంచి పదోతరగతి ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్‌ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. దీంతో న్యాయస్థానం నారాయణకు అప్పట్లో బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా ఆ బెయిల్‌ను రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని