pigeons: ఆ పావురాల పేరు మీద రూ. కోట్ల ఆస్తులు!

పావురాలకు ఆస్తులేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ.. రాజస్థాన్‌లోని నాగౌర్‌ నగర పరిధిలోని జస్నాగర్‌ గ్రామంలో ఉండే పావురాల పేరు మీద 30ఎకరాలకు పైగా భూమి, 27 దుకాణాలు, బ్యాంకులో నగదు నిల్వలు ఉన్నాయి. వీటి విలువ రూ. కోట్లలో ఉంటుంది. అందుకే, గ్రామస్థులు

Published : 11 Aug 2021 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పావురాలకు ఆస్తులేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ.. రాజస్థాన్‌లోని నాగౌర్‌ నగర పరిధిలోని జస్నాగర్‌ గ్రామంలో ఉండే పావురాల పేరు మీద 30ఎకరాలకు పైగా భూమి, 27 దుకాణాలు, బ్యాంకులో నగదు నిల్వలు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుంది. అందుకే, గ్రామస్థులు ఈ పావురాలను మల్టీమిలియనీర్‌ పావురాలు అని పిలుస్తుంటారు. 

నాలుగు దశాబ్దాల కిందట జస్నాగర్‌ గ్రామానికి సజ్జన్‌రాజ్‌ జైన్‌ అనే పారిశ్రామికవేత్త వచ్చి.. పావురాల సంరక్షణ కోసం ఇక్కడే కబుతరన్‌ (పావురాలు) ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడట. ట్రస్టుతో కలిసి గ్రామ ప్రజలు కూడా పావురాల బాగోగులను చూడటం ప్రారంభించారు. మూగపక్షుల కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేయడం మంచి ఆలోచనగా భావించి చాలా మంది విరాళాలు ఇచ్చారట. అలా వచ్చిన డబ్బుతో పావురాల పేరు మీద అప్పట్లోనే దుకాణాలు, భూములు కొనుగోలు చేశారు. వాటి విలువ ఇప్పుడు రూ. కోట్లు పలుకుతోంది. 

పావురాలకు చెందిన దుకాణాల ద్వారా నెలకు రూ.80వేలకుపైగా అద్దె వస్తుందట. వ్యవసాయ భూముల్ని కూడా కౌలుకి ఇచ్చారు. బ్యాంకులో రూ.30లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంది. వీటన్నిటి ద్వారా వచ్చే ఆదాయంతో పావురాలకు ప్రతి రోజు ఆహారం, నీరు అందుబాటులో ఉండేలా ట్రస్టు ప్రతినిధులు చూసుకుంటున్నారు. పావురాల పేరు మీద ఉన్న భూముల్లోని పది ఎకరాల్లో గోశాలలు ఏర్పాటు చేసి 500కుపైగా గోవుల్ని సంరక్షిస్తున్నారు. అంతేకాదు.. ఓ పశువుల ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు. పూర్వీకులు మొదలుపెట్టిన ఈ ట్రస్టును ఇలాగే కొనసాగిస్తామని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని