SC Railway: పర్యాటకులకు శుభవార్త.. పూరీ - కాశీ - అయోధ్య సందర్శనకు ప్రత్యేక రైలు

భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. పూరీ-కాశీ-అయోధ్యలను దర్శించుకునేందుకు పుణ్యక్షేత్ర యాత్రను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

Updated : 15 Mar 2023 19:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వేసవిలో హాలిడే ప్లాన్‌ చేస్తున్నారా? దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని ఉందా? తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసమే ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందుకోసం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్‌ 18న ఈ రైళ్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరనున్నాయి. ఈ ప్యాకేజీ కి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు. మార్చి 18న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరే ఈ ప్రత్యేక రైలు..  ఎనిమిది రోజుల పాటు పూరీ, కోణార్క్‌, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా ప్రయాణించి తిరిగి 26న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. అలాగే, ఏప్రిల్‌ 18న బయల్దేరే రెండో రైలు  మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరి ఆయా దర్శనీయ ప్రాంతాలను చుట్టేసి ఏప్రిల్‌ 25న రాత్రి 11గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకోనుంది. 

యాత్ర సాగేదిలా..

సికింద్రాబాద్‌లో ప్రారంభమైన రైలు పూరీ, కోణార్క్‌, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్‌, కాజీపేట్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగుతుందన్నారు. ఈ రైల్లో మొత్తం 700 సీట్లు ఉంటాయి.460 స్లీపర్ బెర్త్ లు, 192 థర్డ్‌ ఏసీ బెర్త్ లు, 48 సెకండ్‌ ఏసీ బెర్త్ లు ఉంటాయి. ఈ పుణ్యక్షేత్ర యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసి-కాశీ విశ్వనాథ్ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరం దర్శనాలు ఉంటాయి. ఈ యాత్ర 8 రాత్రులు, 9 రోజుల వరకు కొనసాగుతుందని జీఎం తెలిపారు. ఆ తర్వాత రెండో రైలును ఏప్రీల్ 18న నడిపిస్తున్నామన్నారు. మొదటి రైలుకు ఇప్పటికే విశేష ఆధరణ లభిస్తోందన్నారు. 90శాతం సీట్లు నిండిపోయాయని జీఎం వెల్లడించారు. రెండవ రైలులో కూడా 20శాతం సీట్లు  భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. 

టిక్కెట్‌ ధర ఎంతంటే?

700 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా నిర్ణయించారు. స్లీపర్‌ తరగతి (ఎకానమీ)లో టికెట్‌ ధర ఒకరికి  ₹15,300(స్లీపర్‌); 24,085 (థర్డ్‌ ఏసీ), ₹31,500 (సెకండ్‌ ఏసీ) కాగా.. డబుల్‌/ట్రిపుల్‌ షేర్‌ ₹13,955(స్లీపర్‌); 22,510(థర్డ్‌ ఏసీ), ₹29,615(సెకండ్‌ ఏసీ)గా నిర్ణయించారు. అదే 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకైతే ఈ ధరలు వరుసగా ₹13,060, ₹ 21,460, ₹28,360 చొప్పున ఉన్నాయి. యాత్రికులు ప్రయాణించిన తరగతులను బట్టి వారికి గదుల కేటాయింపు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. పుణ్యక్షేత్ర రైలులో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే) అందిస్తారు. ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుంది. ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్‌, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావు. వీటికి పర్యాటకులు  అదనంగా చెల్లించాల్సిందే. 

క్యాన్సిలేషన్‌ పాలసీ ఇదీ..

పర్యటన క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం..  టికెట్‌  బుక్‌  చేసుకున్న  తర్వాత యాత్రకు 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే ₹250లు క్యాన్సిలేషన్‌ ఛార్జిగా నిర్ణయించారు.  అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే  టికెట్‌ మొత్తం ధరలో 25%, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50%, నాలుగు రోజుల కన్నా తక్కువ అయితే 100% కోల్పోవాల్సి వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని