
Ts News: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఏజెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. బాటసింగారం మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పించామని.. అక్కడికి వెళ్లేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే సదుపాయాలు లేకుండానే బలవంతంగా తరలిస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు ఆదేశించినా గడ్డిఅన్నారం మార్కెట్లోకి అనుమతించట్లేదని తెలిపారు. రెండు వైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం బాటసింగారంలో సౌకర్యాల పరిశీలనకు కోర్టు కమిషనర్ను నియమించింది. కోర్టు కమిషనర్గా వినయ్ కుమార్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బాటసింగారం మార్కెట్లో కల్పించిన సౌకర్యాలపై ఈ నెల 19లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గడ్డిఅన్నారంలో వ్యాపారాలు అనుమతించాలని హైకోర్టు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను 19 వరకు పొడిగించింది.