Viral Video: నెల్లూరు జిల్లాలో వియ్యంకుల కొట్లాట.. వీడియో వైరల్‌

ఏడడుగులు.. మూడుముళ్లతో ముడిపడిన వివాహ బంధం ఆర్థిక గొడవలతో వివాదమైంది.

Updated : 03 Sep 2021 11:13 IST

నెల్లూరు: ఏడడుగులు.. మూడుముళ్లతో ముడిపడిన వివాహ బంధం ఆర్థిక గొడవలతో వివాదమైంది. భర్త ఇటీవల ఆత్మహత్య చేసుకోవటంతో భార్యకు కష్టాలు మొదలయ్యాయి. కళ్లెదుటే అత్తమామలు, తల్లిదండ్రులు రాళ్లతో దాడి చేసుకోవటంతో చంటిబిడ్డను ఒడిలో పట్టుకుని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ప్రభాకర్‌రెడ్డి కుమార్తె ఊహారెడ్డిని నెల్లూరు రూరల్‌ ధనలక్ష్మీపురానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి కుమారుడు అఖిల్‌కుమార్‌రెడ్డికి ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు.  అఖిల్‌ రెండు నెలల క్రితం రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కోడలు, అత్తమామల మధ్య గొడవలు పెరిగాయి. కోడలే తమ కుమారుడి మరణానికి కారణమని నాగేశ్వర్‌రెడ్డి దంపతులు ఆరోపించగా.. కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతోనే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని ఊహారెడ్డి వాపోతోంది. ఈ పరస్పర ఆరోపణలు పెద్ద గొడవకు దారి తీయడంతో కోడలిని అత్తమామలు ఇంట్లోకి రానీయలేదు. దీన్ని ప్రశ్నించేందుకు ఊహారెడ్డిని వెంటపెట్టుకుని తల్లిదండ్రులు నేరుగా వియ్యంకుడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి బహిరంగంగా పరస్పరం దాడి చేసుకున్నారు. ఆరు రోజుల క్రితం జరిగిన కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని