AP Floods: కోవూరు వద్ద తెగిన హైవే.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

భారీ వర్షాలకు పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో 16 నంబరు జాతీయ రహదారి కోతకు గురైంది.

Updated : 21 Nov 2021 12:27 IST

నెల్లూరు: భారీ వర్షాలకు పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని దామరమడుగు వద్ద 16వ నంబరు జాతీయ రహదారి తెగిపోయింది. నెల్లూరు నగరం దాటాక చెన్నై-కోల్‌కతా మార్గంలో హైవే ధ్వంసమైంది. పడుగుపాడు వద్ద కూడా రోడ్డు కోతకు గురైంది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు నుంచే రాకపోకలు సాగుతుండటంతో వాహనాలు బారులు తీరాయి. శనివారం రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో దాదాపు 5కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.  మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.  మరోవైపు సంగం- ఆత్మకూరు జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసులు అనుమతించారు. సంగం మండలం కోలగట్ల వద్ద ముంబయి జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గడంతో నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లే వాహనాలను విడిచిపెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని