Tirumala: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల.. 15 నిమిషాల్లోనే ఖాళీ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. జనవరి నెలకు

Updated : 27 Dec 2021 11:36 IST

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 10వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో ఉంచింది. కాగా, టికెట్లు విడుదలైన 15నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం.

పది నిమిషాల వెయిటింగ్.. 5 నిమిషాల్లో ఖాళీ

సర్వదర్శనం ఉచితం కావడంతో చాలా మంది భక్తులు టికెట్లు బుక్‌ చేసుకునేందుకు తమ కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలో తితిదే వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి ఉంచుకున్నారు. సర్వర్‌పై భారం పడుతోన్నందున 9 గంటల సమయంలో 10 నిమిషాలు వర్చువల్ క్యూలో వేచి ఉండాలంటూ స్క్రీన్‌ పై కనిపించింది. 9.10 ప్రాంతంలో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు చూడగా ముఖ్యమైన శని, ఆదివారాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 తేదీలు బుక్ అయిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన తేదీల్లో పేర్లు నమోదు చేస్తుండగానే(అయిదు నిమిషాల్లో) అవి కూడా బుక్‌ అయిపోయినట్లు వెబ్‌సైట్లో కనిపించిందని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారు. 

మరోవైపు రేపు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి కోటాను రేపు మధ్యాహ్నం 3గంటలకు తితిదే విడుదల చేయనుంది. జనవరి 1న వెయ్యి బ్రేక్‌ దర్శన టికెట్లు(రూ.500).. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) ఇందులో ఉండనున్నాయి. జనవరి 14నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ.500)రేపు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శన టికెట్లూ విడుదల కానున్నాయి. సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్‌ దర్శన టికెట్లు(రూ.500).. శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల(రూ.500)ను రేపు తితిదే విడుదల చేయనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని