Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 18 Nov 2021 09:15 IST

1.నేడు తెరాస మహాధర్నా

వరిధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పాల్గొని ఆందోళనకు నేతృత్వం వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాస చేపట్టిన ఆందోళనల్లో ఇది నాలుగోది  కాగా... కేసీఆర్‌ ధర్నాలో పాల్గొనడం ఇదే మొదటి సారి.

2.న్యాయ రాజధాని అంటే ఏంటి?

రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక వ్యాఖ్యలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. సందేహాలు వ్యక్తం చేశారు. ‘అసలు న్యాయ రాజధాని  అంటే ఏమిటి? పాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలులోనే హైకోర్టు ఉండాలనే స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.

3.ధాన్యం ఎంత కొంటారు?
దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం సేకరణ సమస్యలను కేంద్రం సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. పంజాబ్‌ తరహా విధానాన్ని ఇక్కడా చేపట్టాలన్నారు. వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని, వచ్చే యాసంగిలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలని అభ్యర్థించారు.

4.పాఠశాలల్లో సమస్యలపై  ప్రత్యేక కాల్‌సెంటర్‌
పాఠశాలల్లోని సదుపాయాలపై సమస్యలు చెప్పేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఫోన్‌ నంబరును ప్రతి బడిలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ఈ కాల్‌సెంటర్‌ను పర్యవేక్షించే వారి సమాచారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానం అమలుపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు.

5.రైతుల జీవితాలతో సీఎం చెలగాటం
‘‘ధాన్యం దిగుబడి అధికంగా వచ్చే పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లేని కొనుగోళ్ల వివాదం ఇక్కడే ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రీ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వానాకాలం పంటకొంటారో, కొనరో స్పష్టంగా చెప్పాలి.  ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటే ఆరుగురు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రైతుల సమస్య గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడతారా? వేటాడతారా? మీ బెదిరింపులు మానుకోవాలి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

6.వైద్య ఆరోగ్య శాఖలో 11,425 ఉద్యోగాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 11,425 ఉద్యోగాల భర్తీకి పరిపాలనాపరమైన ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. వీటిలో వైద్యుల పోస్టులను శాశ్వత విధానంలో భర్తీ చేయనున్నారు. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, అటెండర్లు, ప్లంబర్లు, ఇతర ఉద్యోగాలను ఒప్పంద, పొరుగుసేవల కింద భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులో పేర్కొన్నారు.

7.అక్కడ వేలల్లో పెళ్లికాని ప్రసాదులు.. వధువుల కోసం ఉత్తరాదిలో వేట!
‘‘పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు’’ ఓ తెలుగు సినిమాలోని పాట ఇది. సరిగ్గా ఇప్పుడు ఈ వాక్యాలు తమిళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువకులకు ఇట్టే సరిపోతాయి. కేవలం ఒకరిద్దరి సమస్య మాత్రమే కాదు.. పెళ్లి వయసు దాటిపోతున్న సుమారు 40వేల మంది సమస్య. అందుకే తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్‌ (తంబ్రాస్‌) ఓ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది.

8.చివరికి గెలవడం అంత తేలిక కాదని తెలిసింది: రోహిత్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో గెలవడం అంత తేలిక కాదని చివర్లో తెలిసొచ్చిందని టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టీ20 సారథిగా నూతన బాధ్యతలు తీసుకున్న అతడు తొలి మ్యాచ్‌లోనే జట్టును గెలిపించాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్‌ (48; 36 బంతుల్లో 5x4, 2x6), సూర్యకుమార్‌ (62; 40 బంతుల్లో 6x4, 3x6) చెలరేగిన సంగతి తెలిసిందే.

9.బావ డేటా ఇస్తే.. బామ్మర్ది లూటీ చేశాడు!

బావా బామ్మర్దులిద్దరు కలిసి వందలాది మంది రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆర్‌బీఎల్‌) క్రెడిట్‌ కార్డుదారులను మోసగించి రూ.3 కోట్లు కొల్లగొట్టిన ఉదంతమిది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఉంటున్న దీపక్‌చౌదరి ఏడాది నుంచి ఓ కాల్‌సెంటర్‌ నిర్వహిస్తూ.. రుణాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.

10.లగేజీ లేకుంటే... విమాన టికెట్‌ మరింత చౌక

లగేజీ లేని ప్రయాణికులకు విమాన టికెట్లు మరింత చౌకగా లభించే అవకాశం ఉంది. ఇందుకోసం టికెట్‌ ధరలో చెక్‌ ఇన్‌ లగేజీ విభాగాన్ని విడదీసే యత్నాల్లో సంస్థలున్నాయి. ఇప్పటికే గోఫస్ట్‌ సంస్థ ఈ దిశగా అడుగులు వేయగా, దేశీయ విమానయాన విపణిలో అగ్రస్థానం కలిగిన ఇండిగో కూడా ప్రయాణికుల టికెట్‌ ధర తగ్గించి, చెక్‌-ఇన్‌ లగేజీపై విడిగా ఛార్జీలు వసూలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని