YS Avinash Reddy: అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌.. మంజూరు చేసిన హైకోర్టు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 31 May 2023 13:44 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ అవినాష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27న హైకోర్టు వాదనలు ముగించింది.

ఈనెల 26న (శుక్రవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు.. మళ్లీ శనివారం మధ్యాహ్నం దాకా ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ కోర్టు ముందున్న విస్తృత సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటికిప్పుడు తుది ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని.. 31న (నేడు) తీర్పు వెలువరిస్తామని అప్పుడు ప్రకటించారు. తాజాగా హైకోర్టు అవినాష్‌కు షరతులతో కూడి ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని.. సాక్షులను ప్రభావితం చేయొద్దని అవినాష్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని అవినాష్‌కు హైకోర్టు సూచించింది. ఆయన్ను అరెస్టు చేసినట్లయితే రూ.5లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని