Hyderabad News: గడ్డి అన్నారం మార్కెట్‌ కూల్చివేతలు ఆపండి: హైకోర్టు

గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ విషయంలో వ్యాపారులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు

Published : 09 Mar 2022 01:23 IST

హైదరాబాద్‌: గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ విషయంలో వ్యాపారులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. గడ్డి అన్నారం పడ్ల మార్కెట్‌లో కూల్చివేతలు వెంటనే ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతల తీరు దురదృష్టకరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాపారులు తమ వస్తువులను బాటసింగారం తరలించేందుకు వీలుగా నెల రోజుల పాటు గడ్డి అన్నారం మార్కెట్‌ తెరవాలని గత నెల 8న హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయడం లేదని ఇటీవల ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో .. ఈనెల 4న హడావుడిగా మార్కెట్‌ తెరిచారు. గత నెల 8న ఆదేశించినప్పటికీ  ఈనెల 4 వరకు మార్కెట్‌లోకి అనుమతించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో పాటు పాట షెడ్లు, భవనాలు కూల్చివేస్తున్నారని ఇవాళ వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు హైకోర్టుకు తెలిపారు. వందలాది పోలీసులను మోహరించి అర్ధరాత్రి నుంచి మార్కెట్‌ కూలుస్తున్నారని వివరించారు.  గడ్డి అన్నారం మార్కెట్‌లోని 106 మంది కమీషన్‌ ఏజెంట్లలో 76 మంది ఖాళీ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ ఈనెల 14కి వాయిదా వేసిన హైకోర్టు.. మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ లక్ష్మీబాయి హాజరుకావాలని ఆదేశించింది.

రెండ్రోజుల గడువు పూర్తి కావడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు తెలిపారు. సువిశాల స్థలంలో త్వరలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరశివారులోని బాట సింగారం లాజిస్టిక్‌ పార్కులోనే తాత్కాలికంగా పండ్ల మార్కెట్‌ కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించింది. కొహెడలో శాశ్వత మార్కెట్‌ పూర్తయ్యే వరకు బాట సింగారంలోనే అమ్మకాలు జరుగుతాయని మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెప్పాయి. హడావుడి కూల్చివేతలపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని