Tirumala: వేసవి రద్దీ.. భక్తులు తితిదేకు సహకరించాలి: ఈవో ధర్మారెడ్డి

మే 14 నుంచి 18 వరకు ఐదురోజుల పాటు హనుమత్‌ జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డయల్‌ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడారు.

Published : 12 May 2023 15:29 IST

మే 14 నుంచి 18 వరకు హనుమత్‌ జయంత్యుత్సవాలు

తిరుమల: తిరుమలలో మే 14 నుంచి 18 వరకు ఐదురోజుల పాటు హనుమత్‌ జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్‌ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడుతూ.. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడారు. తిరుమలలో శనివారం ఉదయం రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో శ్రమదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని ధర్మారెడ్డి చెప్పారు.

హనుమత్‌ జయంతి ఉత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మే 14న తుని తపోవనం సచ్చిదానంద స్వామి, మే 15న కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిస్వామి, మే 16న కంచి పీఠాధిపతి విజయేంద్రసరస్వతి స్వామి, మే 17న అహోబిల మఠాధిపతి శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి, మే 18న పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతీ తీర్థ స్వామీజీలు అనుగ్రహ భాషణం చేస్తారని వివరించారు. తిరుమల వేదవిజ్ఞాన పీఠంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు 67 మంది ప్రముఖ పండితులతో అఖండ పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తామన్నారు.

సర్వదర్శనంలో రోజుకు 10-15 వేల మందికి మాత్రమే..

తిరుమలలో వేసవిలో రద్దీ ప్రారంభమైందని.. రోజుకు శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు కలిపి 55 వేలు కేటాయిస్తున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనంలో రోజుకు 10 నుంచి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కావున దర్శనానికి వచ్చే భక్తులు ఓపికతో ఉంటూ తితిదేకు సహకరించాలని కోరారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్‌, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్‌, ఏటీసీ సర్కిల్‌లో పాదరక్షలు భద్రపరిచే కేంద్రాలను ప్రారంభించామన్నారు. త్వరలో పీఏసీ 1, 2, 3, నారాయణగిరి క్యూలైన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద కూడా ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యథావిధిగా 1240వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు ఇస్తామన్నారు. 

తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్‌ ఎదురుగా విష్ణు నివాసం, రైల్వే స్టేషన్‌ వెనుకవైపు గోవిందరాజస్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ (ఎస్‌.ఎస్‌.డి) టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ విషయాలను గమనించాలని కోరారు. తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద తప్పనిసరిగా స్కాన్‌ చేయించుకోవాలని.. లేనిపక్షంలో స్లాటెడ్‌ దర్శనానికి అనుమతించమని చెప్పారు. శ్రీవారి భక్తులు తితిదే పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో తితిదే ఐటీ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి 52 నకిలీ వెబ్‌సైట్లు, 13 నకిలీ మొబైల్‌ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ వెబ్‌సైట్ల గురించి తెలిస్తే 155257 కాల్‌సెంటర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్‌ చేసుకోవాలని భక్తులను ఈవో సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని