వజ్రాలు కనుగొన్నారు.. ధనవంతులయ్యారు!

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దినసరి కూలీలను అదృష్టం తలుపు తట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో గనుల్లోకి పనికి వెళ్లిన వారికి రెండు అధిక విలువ కలిగిన వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాలను సేకరించిన అధికారులు.. వాటిని వేలం వేయగా వచ్చే నగదును కూలీలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Updated : 04 Nov 2020 06:19 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దినసరి కూలీలను అదృష్టం తలుపు తట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో గనుల్లోకి పనికి వెళ్లిన వారికి రెండు అధిక విలువ కలిగిన వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాలను సేకరించిన అధికారులు.. వాటిని వేలం వేయగా వచ్చే నగదును కూలీలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పన్నా జిల్లాలోని గనుల అధికారి అనుపమ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘దిలీప్‌ మిస్త్రీ, లఖన్‌ యాదవ్‌లు కల్యాణ్‌పూర్‌, జర్వా పూర్‌ ప్రాంతాల్లోని గనుల్లో పనికి వెళ్లారు. ఈ క్రమంలో వారు రెండు అధిక విలువ కలిగిన వజ్రాలను కనుగొన్నారు. వాటిని సోమవారం వజ్రాల కార్యాలయంలో సమర్పించాం. ఆ రెండింటిలో ఒకటి 7.44 క్యారెట్లు ఉండగా.. మరొకటి 14.98 క్యారెట్లు బరువు ఉందని తేలింది. ఈ వజ్రాలపై వేలం నిర్వహిస్తాం. వచ్చిన నగదులో రాయల్టీ పోగా మిగిలిన భాగం విలువను కూలీలకు అందజేస్తాం. అందులో చిన్న వజ్రం విలువ రూ.30లక్షలకు పైగా ఉండొచ్చని.. పెద్ద రాయి విలువ దానికి రెట్టింపు ఉంటుంది’ అని తెలిపారు. కాగా వజ్రాలను వెలికితీయడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని కూలీలు తెలిపారు. దేవుడి ఆశీర్వాదం వల్లే తాము వాటిని కనుగొనగలిగామని వారు వెల్లడించారు. వాటి వేలం ద్వారా వచ్చే డబ్బుతో పిల్లల్ని బాగా చదివించుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని