ట్రంప్‌కు కోపమొచ్చింది..

ట్విటర్‌ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు.

Published : 17 Oct 2020 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో అవినీతి లావాదేవీలు జరిగాయని ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. హంటర్‌ ఈ మెయిల్‌లోని సమాచారాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ సమాచారం హంటర్‌కు చెందిన పాత కంప్యూటర్‌ను హ్యాక్‌ చేయటం ద్వారా లభించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అయితే నిర్ధారణ కాని ఆ ఖాతాలో సమాచారం ప్రామాణికం కాదని పలు విమర్శలు రావడంతో.. ఫేస్ బుక్, ట్విటర్ ఈ వార్తకు సంబంధించిన లింక్లను బ్లాక్ చేశాయి. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు.

ట్రంప్‌ అభ్యంతరం

ట్రంప్‌ వర్గం ఈ చర్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ప్రత్యర్థి జో బైడెన్ ను విమర్శిస్తూ ప్రచురించిన ఈ కథనాన్ని ఈ రెండు మాధ్యమాలూ కావాలనే సెన్సార్ చేశాయని అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు. కాగా, నిజానిజాలను నిర్ధారించుకోకుండా తాము ఈ ఈ కథనానికి సంబంధించిన లింక్‌లను పోస్ట్ చేయలేమని ట్విటర్ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా ట్విటర్‌ తన నిర్ణయాన్ని బయటకు ప్రకటించకపోవటంతో.. ఆ వార్తను షేర్‌ చేయటానికి ప్రయత్నించి విఫలమైన యూజర్లు అయోమయానికి గురయ్యారు.

ట్విటర్‌ స్పందన

ఈ పరిస్థితిపై ట్విటర్‌ సీఈఓ జార్‌ డోర్సీ స్పందించారు. తాము సంస్థ నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నప్పటికీ.. తగిన వివరణ ఇవ్వకుండానే అలా చేయటం ఆమోదనీయం కాదని ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో హ్యాకింగ్‌ కథనాలపై తాము స్పందించే వైఖరిలో మార్పులు చేస్తూ ట్విటర్‌ తాజా నిర్ణయం తీసుకుంది. హ్యాక్‌ చేశారని భావిస్తున్న సమాచారాన్ని, అది హ్యాకర్లు షేర్‌ చేస్తే తప్ప తొలగించబోమని సంస్థ ఉన్నతాధికారి విజయా గద్దే తాజాగా ప్రకటించారు. సదరు సమాచారాన్ని షేర్‌ చేయకుండా నిరోధించేందుకు బదులుగా... వివరాలను సరిచూసుకోవాల్సిందిగా సంబంధిత పోస్టుపై సూచన వెల్లడవుతుందని ఆమె తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపంలో ఉన్న తరుణంలో ఈ చర్య ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని