Ambani bomb scare case: ‘సూపర్ కాప్’ అవ్వాలని.. అంబానీని భయపెట్టి డబ్బు లాగాలని..
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి
ప్లాన్ అంతా సచిన్ వాజేదే.. ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
ముంబయి: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ‘సూపర్ కాప్’గా తన పాపులారిటీని తిరిగి తెచ్చుకోవాలని, అంబానీని బెదిరించి డబ్బు రాబట్టాలని వాజే ఈ కుట్రంతా పన్నినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముంబయిలోని అంబానీ నివాసం ఎదుట జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ కారు నిలిపి ఉంచడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సచిన్ వాజే సహా మరికొందరిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఇటీవల ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం మొత్తాన్ని సచిన్ వాజేనే నడిపించినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఉగ్రవాదుల పేరుతో ప్రముఖులను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి భారీగా డబ్బు దండుకోవాలనేది వాజే ప్లాన్ అని తెలిపింది. అంతేగాక, ఇలాంటి కేసులను తానే టేకప్ చేసి ‘సూపర్కాప్’గా పాపులారిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లు వివరించింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఫిబ్రవరి 25న సచిన్ వాజేనే స్వయంగా పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారును తీసుకెళ్లి అంబానీ నివాసం ఎదుట పార్క్ చేశాడు. ఈ కారు వెనకాలే ముంబయి క్రైం బ్రాంచ్కు చెందిన ఇన్నోవా వాహనం కూడా వచ్చినట్లు సీసీటీవీల్లో కన్పించింది. ఆ తర్వాత ఈ కేసును టేకప్ చేసిన వాజే.. కుట్రను దాచిపెట్టేందుకు దర్యాప్తును తప్పుదారి పట్టించాడు. మరోవైపు కార్లకు ఉపయోగించిన నకిలీ నంబరు ప్లేట్లకు సంబంధించిన పత్రాలు, సీసీటీవీ ఫుటేజ్ల ఎలక్ట్రానిక్ డీవీఆర్ వంటి సాక్ష్యాలను ధ్వంసం చేశాడు. ఈ సాక్ష్యాలను ముంబయి, ఠాణెలోని పలు ప్రాంతాల్లో పడేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది.
హీరేన్ హత్యకు పథకం..
పేలుడు పదార్థాలతో కూడిన వాహనం యజమాని మన్సుఖ్ హీరేన్ హత్యకు కూడా వాజేనే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొంది. తొలుత మన్సుఖ్ కూడా వాజేతోనే కలిసి పనిచేశాడు. కుట్రలో భాగంగా తొలుత హీరేన్ తన కారు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తులో అతడు కూడా ఓ నిందితుడని తేలింది. ఈ క్రమంలోనే మార్చి 5న హీరేన్ ఠాణె శివారులో శవమై కన్పించాడు. అంబానీకి బెదిరింపుల కేసును హీరేన్పై వేసేందుకు వాజే ప్రయత్నించాడు. ఘటనకు పాల్పడింది తానేనని ఒప్పుకోవాలని హీరేన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు అతడు అంగీకరించకపోవడంతో హీరేన్ హత్యకు పథకం పన్నాడు. ఇందుకోసం తన స్నేహితుడైన ప్రదీప్ శర్మ అనే పోలీసును ఉపయోగించుకున్నట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో వెల్లడించింది.
అంబానీని భయపెట్టాలని..
హీరెన్ను హత్య చేసి వాజే.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు భయపడి హీరేన్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తను ప్రచారం చేశాడు. ఇక ఆ రోజు అంబానీ ఇంటి ముందు వాహనం నిలిపిన తర్వాత వాజే అందులో ఓ బెదిరింపు లేఖను పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే జైషే ఉల్ హింద్ పేరుతో టెలిగ్రామ్లో ఓ పోస్ట్ వచ్చింది. అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కారు వెనుక బాధ్యులం తామేనని జైషే ఉగ్రవాదులు ఆ పోస్ట్లో పేర్కొన్నట్లుగా ఉంది. ఉగ్రవాదుల పేరు చెప్పి.. పేరు ప్రఖ్యాతలున్న సంపన్నులను బెదిరించేందుకు వాజే ఇవన్నీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. వారిని భయపెట్టి పెద్ద మొత్తంలో డబ్బు దండుకోవాలనేది వాజే ప్లాన్ అని ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొంది.
గుజరాత్ ట్రిప్ రద్దు చేసుకున్న నీతా..
ఘటన జరిగిన తర్వాత ముకేశ్ అంబానీ సతీమణి నీతా తన గుజరాత్ ట్రిప్ను రద్దు చేసుకున్నట్లు ఆంటిల్లా(అంబానీ నివాసం) సెక్యూరిటీ హెడ్ వెల్లడించారు. ఇంటి ముందు కారును, బెదిరింపు లేఖను గుర్తించగానే వెంటనే అంబానీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని అంబానీ కుటుంబం చెప్పినట్లు తెలిసింది. అయితే పోలీసుల సూచన మేరకు నీతా అంబానీ తన గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సెక్యూరిటీ హెడ్ చెప్పారని ఎన్ఐఏ తమ ఛార్జ్షీట్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్