Anand Mahindra: అది నన్ను చివరి వరకు మోసం చేసింది : ఆనంద్‌ మహీంద్రా

మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా చేసిన ఓ ట్వీట్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. సమస్యలను మనం వాస్తవానికి అవి ఉన్నవాటికంటే పెద్దవిగా చూస్తామనే సందేశాన్నిస్తూ ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు.

Updated : 12 Dec 2022 15:40 IST

ముంబయి: మహీంద్రా (Mahindra) సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ఆసక్తికర పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఆయన ఏ పోస్టు చేసినా.. అందులో ఏదో కొత్త విషయం కచ్చితంగా ఉంటుంది. ప్రతి సోమవారం ఓ స్ఫూర్తిదాయక సందేశం(Motivational message)తో ట్విటర్‌ (Twitter) యూజర్లను ఆకట్టుకునే ఆయన.. ఈ వారం ఓ వీడియోను పోస్టు చేశారు. ఎక్కడ షూట్‌ చేశారో తెలియదు గానీ, ఓ విమానం అదుపు తప్పి జనావాసాల వైపు దూసుకొస్తోంది. ఆ దృశ్యాన్ని చూస్తే నిజంగా పెద్ద ప్రమాదమేదో జరగబోతోందని అందరూ అనుకుంటారు. కానీ, మేడపై నిల్చున్న ఓ అబ్బాయి.. చటుక్కున దానిని ఒడిసి పట్టేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘ఇది నన్ను చివరి వరకూ మోసం చేసింది’ అని అన్నారు. అయితే, ఈ వీడియో నుంచి ఓ నీతిని కూడా గ్రహించవచ్చని ఆయన చెప్పారు. ‘‘ మన సమస్యలను, భయాలను.. వాస్తవానికి అవి ఉన్నవాటి కంటే పెద్దవిగా చూస్తాము. కానీ, ప్రతి సమస్యకూ పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. తనను అవసరమైన దానికంటే ఎక్కువ ఆందోళనకరంగా కనిపించేలా చేయొద్దు అని పేర్కొన్నారు. దీనికి Monday Motivation అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా జోడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని