Manipur: ఆందోళనల్లో నష్టపోయిన వారికి కేంద్రం సాయం.. రాష్ట్రానికి ₹ 101 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ

మణిపూర్‌ (Manipur)కు కేంద్రం ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించింది. గడచిన 48 గంటల్లో రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుడు కుల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. 

Published : 08 Jun 2023 20:27 IST

ఇంఫాల్‌: గత నెల రోజులుగా హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ (Manipur)కు కేంద్రం (Central Govt) ₹ 101.75 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఆందోళనల్లో నష్టపోయిన వారికి సాయం అందించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్రప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్‌దీప్‌ సింగ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గాయని, గడచిన 48 గంటల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. ‘‘గత నెల రోజులుగా రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా నష్టపోయిన వారికి సాయం అందించేందుకు కేంద్రం ₹ 101.75 కోట్ల సాయం అందించేందుకు అంగీకరించింది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సాయం కోసం కేంద్రానికి అభ్యర్థన పంపించాలని రాష్ట్ర అధికారులకు సూచించారు. రాష్ట్రం పంపిన అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజ్‌ని ప్రకటించింది’’ అని సింగ్ తెలిపారు. 

గడచిన 24 గంటల్లో భారీ ఎత్తున ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. లోయ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో 12 గంటలు, పక్కనే ఉన్న కొండ ప్రాంతంలోని జిల్లాల్లో 8 నుంచి 10 గంటలు కర్ఫ్యూ సడలించినట్లు సింగ్‌ తెలిపారు. కొండ ప్రాంతంలోని మరో ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేయడం లేదన్నారు. 

‘‘రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు భద్రతా బలగాలు సామాజిక సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని సింగ్‌ తెలిపారు. గత నెలరోజులుగా మణిపుర్‌లో చెలరేగిన హింసలో తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. సుమారు 100 ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని