Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్‌ ఎంపీ ట్వీట్

సెంగోల్‌ (Sengol)ను లోక్‌సభలో స్పీకర్‌ స్థానం పక్కన ఉంచడంపై గత కొద్దిరోజులుగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుతుతోంది. ఈ నేపథ్యంలో రాజదండంపై కాంగ్రెస్‌ (Congress) ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) ఆసక్తికర ట్వీట్ చేశారు. 

Published : 28 May 2023 19:36 IST

దిల్లీ: నూతన పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రారంభించడాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంగోల్‌ (Sengol) రాజదండంపై కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుత విలువలకు చిహ్నంగా సెంగోల్‌ను అందరం అంగీకరించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

‘‘సెంగోల్‌ వివాదంపై ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిపై ఇరు పక్షాలు మంచి వాదనలు వినిపిస్తున్నాయి. రాజదండం సార్వభౌమాధికారం, ధర్మ నియమం, సంప్రదాయాల కొనసాగింపును ప్రతిబింబిస్తుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ప్రతిపక్షం మాత్రం.. ప్రజల పేరుతో రాజ్యాంగం ఆమోదించబడిందని, సార్వభౌమాధికారం అనేది పార్లమెంట్‌లో భారత దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుందని, అది దైవిక హక్కుగా రాజులకు సంక్రమించే విశేషాధికారం కాదని అంటోంది. అధికార మార్పిడికి గుర్తుగా మౌంట్‌ బాటన్‌ సెంగోల్‌ను నెహ్రూకు అందించారన్న ఆధారాలు లేని వాదనను ఇరు పక్షాలు మర్చిపోతే ఈ వివాదం సమసిపోతుంది. అయితే, సెంగోల్‌ రాజదండాన్ని అధికారానికి సంప్రదాయ చిహ్నమని చెబుతున్నందువల్ల..  దాన్ని లోక్‌సభలో ఉంచడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారం ఏ రాజు దగ్గర లేదనే విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుత విలువలకు చిహ్నంగా అందరం సెంగోల్‌ను అంగీకరించాలి’’ అని థరూర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

గత కొద్దిరోజులుగా సెంగోల్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుతుతోంది. అధికార మార్పిడి బదిలీకి గుర్తుగా సెంగోల్‌ను బహూకరించినట్లు ఆధారాలేవీ లేవని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే, ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా హోం మంత్రి అమిత్‌ షా, భాజపా నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. సెంగోల్‌ రాజదండాన్ని ఓ చేతికర్ర మాదిరిగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మ్యూజియంలో భద్రపరిచిందని ప్రధాని మోదీ విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని