Corona: మార్చి నాటికి ఎండమిక్‌ దశకు కరోనా..!

మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమిరన్ పాండా అంచనా వేశారు.

Published : 20 Jan 2022 01:56 IST

ఐసీఎంఆర్‌కు చెందిన నిపుణుడి అంచనా

దిల్లీ: మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. ‘మనం మన రక్షణ కవచాల(కొవిడ్‌ నిబంధనలను ఉద్దేశిస్తూ) విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుంది. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను భర్తీ చేస్తే.. కొవిడ్ ఎండమిక్‌గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతే ఆ అవకాశం ఉంటుంది’ అని పాండా అభిప్రాయపడ్డారు. 

నిపుణుల బృందం అంచనా ప్రకారం.. డిసెంబర్ 11తో ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంది. ‘మార్చి 11 నుంచి మనకు కొంత ఉపశమనం లభించవచ్చు. అలాగే దిల్లీ, ముంబయిలో కరోనా గరిష్ఠ స్థాయికి చేరిందా..? లేదా..? అనే విషయం చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాల్సి ఉంది. అక్కడ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేం’ అని ఆయన తెలిపారు. దిల్లీ, ముంబయిలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80:20 నిష్పత్తిలో ఉన్నాయన్నారు. మహమ్మారి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉందని, దానికి తగ్గట్టే ఐసీఎంఆర్ పరీక్షా వ్యూహాలు మారుస్తుందని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని