బిగ్‌ టెక్‌ కంపెనీల విషయంలో అంతర్జాతీయ సహకారం అవసరం: DNPA సమావేశంలో వక్తలు

బిగ్ టెక్ కంపెనీలతో కంటెంట్‌ను పంచుకునే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను భారత్‌ అనుసరించాలని వక్తలు సూచించారు. బిగ్‌ టెక్‌ కంపెనీలు, డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ మధ్య సంబంధాల అంశంపై డీఎన్‌పీఏ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

Updated : 10 Dec 2022 20:25 IST

దిల్లీ: బిగ్ టెక్ కంపెనీలతో కంటెంట్‌ను పంచుకునే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను భారత్‌ అనుసరించాలని వక్తలు సూచించారు. బిగ్‌ టెక్‌ కంపెనీలు, డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ మధ్య సంబంధాల అంశంపై డీఎన్‌పీఏ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. భారత్‌లో 17 ప్రధాన మీడియా సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ (DNPA) రెండో విడత వర్చువల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో కెనడాకు చెందిన టేలర్‌ ఒవెన్‌, అమెరికాకు చెందిన కర్ట్‌నీ రాడ్ష్‌, కెనడాకు చెందిన పాల్‌ డీగన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

బిగ్‌ టెక్‌ కంపెనీలతో కంటెంట్‌ షేరింగ్‌ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక కూటమి అవసరమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. కెనడా త్వరలో తీసుకొచ్చే న్యూస్‌ మీడియా బార్గెయినింగ్‌ కోడ్‌ను అందిపుచ్చుకోవాలని భారత్‌కు సూచించారు. బిగ్‌ టెక్‌ కంపెనీలు, న్యూస్‌ పబ్లిషర్ల మధ్య ఆదాయం పంపిణీ కోసం ఆస్ట్రేలియా తీసుకొచ్చిన గత చట్టం కంటే కెనడా తీసుకురాబోతున్న చట్టం మరింత దృఢంగా, పారదర్శకంగా ఉండబోతోందని తెలిపారు. మీడియా అవుట్‌లెట్‌లతో టెక్ కంపెనీలు చేసుకుంటున్న ఒప్పందాలు ఏమాత్రం సరిపోవని, అందుకు చట్టాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికాలో సైతం ఈ తరహా చట్టాలను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డీగన్‌ పేర్కొన్నారు. కెనడా బిల్లుకు ప్రతిస్పందనగా ప్రచురణకర్తలను విభజించడానికి ప్రయత్నించే వ్యూహాన్ని గూగుల్‌ ప్రయోగిస్తోందని, మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబీపీ నెట్‌వర్క్‌ సీఈఓ అవినాశ్‌ పాండే, హెచ్‌టీ డిజిటల్‌ పునీత్‌ జైన్‌ తదితరులు మాట్లాడారు. వార్తా ప్రచురణకర్తలు, ప్రధాన టెక్ కంపెనీల మధ్య ఆదర్శవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఉన్న సవాళ్ల గురించి చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని