Bihar: అమానుషం.. అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న రైతులపై పోలీసుల దాడి..!

బిహార్‌(Bihar) రైతులపై అర్ధరాత్రి పూట పోలీసులు వీరంగం సృష్టించారు. ఇష్టారీతిగా దాడి చేశారు. 

Published : 11 Jan 2023 13:56 IST

పట్నా: అర్ధరాత్రి పూట నిద్రిస్తున్న రైతులను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. బిహార్‌(Bihar)లోని బక్సర్(Buxar) జిల్లాలోని ముఫాసిల్ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే..?

రాత్రి పూట ఇంట్లో నిద్రిస్తోన్న రైతులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పదిమందికి పైగా పోలీసులు వారిపై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. లాఠీలతో దాడి చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న పవర్‌ ప్లాంట్(Power Plant) కోసం తీసుకున్న భూమికి మెరుగైన ధర చెల్లించాలని నిరసన చేస్తోన్న రైతులపై వీరంగం సృష్టించారు. ఈ భూములు బిహార్‌ రాజధాని పట్నాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రైతులే తమపై మొదట దాడికి దిగారని పోలీసులు అంటున్నారు. రైతులు మాత్రం ఆ వాదనను ఖండించారు.  

ఈ వీడియోలో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి దూసుకురావడంతో పాటు మహిళలపై కూడా దాడిచేసినట్లు తెలుస్తోంది. ముఫాసిల్ పోలీసు స్టేషన్‌లోని సీనియర్ అధికారి అమిత్‌ కుమార్ ఈ దాడికి సూత్రధారుడని రైతులు విమర్శించారు. రైతులు నిరసన చేసి, ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి పూట ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో పోలీసులు ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన నేపథ్యంలో కొందరు వ్యక్తులు పవర్ ప్లాంట్‌పై  కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అలాగే పోలీసులకు వారికి మధ్య ఘర్షణ జరిగిందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 

1320 మెగావాట్ల SJVN విద్యుత్‌ ప్లాంట్‌(Power Plant) గత ఏడాది నుంచి నిర్మాణంలో ఉంది. దాని కోసం సేకరించిన భూములకు 12 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధరలను సవరించాలని రైతులు ఈ నిరసన చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని