భారతీయ సంస్కృతులు అందరికీ ఆదర్శం: మోదీ

మన దేశంలోని విభిన్న సంస్కృతులు ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన 62వ ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ ఇటీవల దేశ రాజధాని దిల్లీలో తాను సందర్శించిన ‘హునార్‌ హాత్‌’ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

Published : 24 Feb 2020 00:37 IST

దిల్లీ: మన దేశంలోని విభిన్న సంస్కృతులు ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన 62వ ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ ఇటీవల దేశ రాజధాని దిల్లీలో తాను సందర్శించిన ‘హునార్‌ హాత్‌’ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘వైవిధ్యభరితమైన మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు పౌరులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ ప్రదర్శనలో దేశంలోని విభిన్న సంప్రదాయాలు, వంటరుచులు, భావోద్వేగాలు ఉట్టిపడ్డాయి. వివిధ రకాల హస్తకళలు, సంగీత వాయిద్యాలు దేశ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపాయి’ అని మోదీ పేర్కొన్నారు.  

‘ఆ ప్రదర్శనలో ఓ దివ్యాంగురాలైన మహిళతో మాట్లాడటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. పెయింటింగ్స్‌ అమ్మకం ద్వారా ఆమె తన కాళ్లపై తాను నిలబడుతూనే సొంత ఇల్లు కూడా కొనుగోలు చేయడం గొప్ప విషయం. ఈ హునార్‌ హాత్‌ ప్రదర్శన కారణంగా మూడేళ్లలో 3లక్షల మంది కళాకారులు ఉపాధి పొందారు’ అని చెప్పారు.

ఫిట్‌గా ఉంటేనే హిట్‌ అవుతాం

దేశ ప్రజల ఫిటినెస్‌ గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ‘దేశం ఫిట్‌గా ఉన్నప్పుడే హిట్‌ అవుతుంది. పర్వతారోహణ సహా పలు సాహస క్రీడల్లో భారత్‌ మంచి అవకాశాలు అందిస్తోంది’ అని తెలిపారు. ‘దేశంలోని చిన్నారుల్లో సైన్స్‌, సాంకేతికత పట్ల ఆసక్తి పెరుగుతోంది. చంద్రయాన్‌-2 విడుదల సమయంలో బెంగళూరులో పాల్గొన్న సమయంలో వారిలోని ఉత్సుకతను చూశాను. సైన్స్‌ పట్ల యువతను ప్రోత్సహించడం కోసం ఇస్రో ప్రారంభించిన యువిక కార్యక్రమాన్ని ప్రశంసనీయం’ అని చెప్పారు.

ఈ సందర్భంగా మోదీ కేరళలోని కొల్లంకు చెందిన 105 ఏళ్ల భాగీరథి అనే వృద్ధురాలి గురించి ప్రస్తావిస్తూ.. ఆమె ఈ వయసులో కూడా తన పాఠశాల విద్యను పున:ప్రారంభించారని ఉదహరించారు. అనంతరం మోదీ రాబోయే పండగలు హోలీ, గుడి పడ్వా, నవరాత్రి, రామనవమి పండగలకు ప్రజలకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని