నిర్భయ దోషి పవన్‌ గుప్తా క్షమాభిక్ష తిరస్కరణ

నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీయాల్సి ఉండగా......

Updated : 04 Mar 2020 17:12 IST

దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీయాల్సి ఉండగా.. పవన్‌ అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో శిక్ష అమలు వాయిదా పడింది.  శిక్ష అమలును ఆపేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా గతవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీన్ని న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అతడు చిట్టచివరి అవకాశంగా క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపగా.. పవన్‌ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు తిరస్కరించారు. 

క్షమాభిక్ష అభ్యర్థన పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్‌ దిల్లీ పటియాల హౌస్‌ కోర్టులో మార్చి 2న పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే విధించింది. దీంతో మూడోసారి దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని