కరోనా సోకి 4నెలల చిన్నారి మృతి!

కరోనా వైరస్‌ సోకి నాలుగు నెలల చిన్నారి మరణించిన సంఘటన కేరళలో జరిగింది. కేరళలోని కోజికోడ్‌కి చెందిన చిన్నారి హృదయ సంబంధ సమస్యలతో ఈ నెల 21న స్థానిక మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరింది.

Updated : 24 Apr 2020 12:04 IST

కోజికోడ్(కేరళ): కరోనా వైరస్‌ సోకి నాలుగు నెలల చిన్నారి మరణించిన సంఘటన కేరళలో జరిగింది. కేరళలోని కోజికోడ్‌కి చెందిన చిన్నారిని హృదయ సంబంధ సమస్యలతో ఈ నెల 21న స్థానిక మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న చిన్నారికి న్యుమోనియా లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు అధికారులు. వైద్యపరీక్షల్లో చిన్నారికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా చిన్నారి ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం మరణించినట్లు మలప్పురం జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ ధృవీకరిస్తూ..చిన్నారి గత కొంత కాలంగా గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే, అసలు ఆ చిన్నారికి వైరస్‌ ఎలా సోకిందనే విషయాన్ని గుర్తించే పనిలోపడ్డారు అధికారులు. తల్లిదండ్రుల సమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపించారు. ఈ సమయంలో చిన్నారి తల్లిదండ్రులతోపాటు ఆసుపత్రిలో చికిత్స అందించిన ఐదుగురు వైద్యులను క్వారంటైన్‌లో ఉంచారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కట్టడిలో ముందున్న కేరళలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 447 పాజటివ్‌ కేసులు నమోదుకాగా ఇప్పటికే 324మంది కోలుకున్నారు.

రాజస్థాన్‌లో 2వేల కేసులు..
రాజస్థాన్‌లో తాజాగా 32కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2000కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జైపూర్, కోటా, జోధ్‌పూర్‌, అజ్మీర్‌లలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్‌బారినపడి 27మంది మృత్యువాతపడ్డారు.

ప్లాస్మా ట్రయల్స్‌లో సత్ఫలితాలు!

దిల్లీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా ట్రయల్స్‌ సత్ఫలితాలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ పద్ధతి ద్వారా కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స చేసేందుకు గతవారమే కేంద్రం నుంచి అనుమతి పొందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ఈ పద్ధతిలో కరోనా వైరస్‌ సోకి కోలుకున్న వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరించి బాధితులకు ఎక్కిస్తారు. 

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య 23,077కి చేరగా 718మంది మృతి చెందినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.

ఇవీ చదవండి..

భారత్‌లో 700 దాటిన కరోనా మరణాలు..

వేసవి పరిస్థితులతో కరోనా వైరస్‌ నశిస్తుంది!..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని