ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15 శాతం

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం వడ్డీ ఇవ్వాలని ట్రస్టీల బోర్డు నిర్ణయించింది.

Published : 29 Mar 2023 02:26 IST

ట్రస్టీల బోర్డు నిర్ణయం

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం వడ్డీ ఇవ్వాలని ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22లో ఇచ్చిన 8.10శాతంతో పోల్చితే ఇది    0.05% అధికం. ఈపీఎఫ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లపై సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (సీబీటీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ తుది అనుమతులు ఇస్తే.. వడ్డీ రేటు అమలవుతుంది. అందుకు అనుగుణంగా 5 కోట్ల చందాదారుల ఖాతాల్లోకి వడ్డీ జమ చేస్తారు. 2022 మార్చిలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది సంస్థ. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఏడాదికి 8.1 శాతానికి తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వడ్డీ ఇవ్వగా.. ఆ తర్వాత 2021-22 ఏడాదిదే అత్యంత తక్కువ వడ్డీ రేటు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా.. అప్పటి నుంచి ఒక్క ఏడాది మినహా వడ్డీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ఉమ్మడి ఆప్షన్‌ విషయంలో సందేహాలు

ఈపీఎఫ్‌పై ఈసారి వడ్డీరేటు పెంచాలని కార్మిక సంఘాలు ఇదివరకే డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సీబీటీ సమావేశంలోనూ తమ గళాన్ని వినిపించాయి. వడ్డీ రేటుతో పాటు తమ సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశంలో మాట్లాడారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు విషయంలో ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో అనేక సందేహాలున్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని