ఏడేళ్ల వయసులో బాలిక అపహరణ.. 9 ఏళ్ల తర్వాత ఆచూకీ లభ్యం

తొమ్మిదేళ్ల క్రితం అపహరణకు గురైన బాలిక ఆచూకీని గుర్తించారు పోలీసులు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.ముంబయిలోని అంధేరి ప్రాంతంలో 2013 జనవరి 22న పూజ అనే ఏడేళ్ల బాలిక

Published : 08 Aug 2022 05:45 IST

తొమ్మిదేళ్ల క్రితం అపహరణకు గురైన బాలిక ఆచూకీని గుర్తించారు పోలీసులు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.ముంబయిలోని అంధేరి ప్రాంతంలో 2013 జనవరి 22న పూజ అనే ఏడేళ్ల బాలిక అదృశ్యమైంది. స్కూల్‌కు వెళ్లిన బాలికను హారీ డిసౌజా అనే వ్యక్తి ఎత్తుకుపోయాడు. పిల్లలు లేకపోవడం వల్ల తాను పెంచుకోవాలని ఆమెను అపహరించాడు. పాప ఆచూకీ కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయేసరికి పూజ తల్లిదండ్రులు స్థానిక డీఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర భోస్లే ఆ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. రెండేళ్లుగా గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. రిటైరైన తర్వాత కూడా ఆయన ఆ కేసును వదల్లేదు. హారీ డిసౌజా పోలీసుల భయంతో బాలికను.. తన సొంతూరు కర్ణాటకలోని రాయచూర్‌లో ఒక హాస్టల్‌లో చేర్చాడు. 2016లో డిసౌజా దంపతులకు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న బాలికను తిరిగి ముంబయి రప్పించాడు. ఇద్దరు పిల్లలను పెంచే స్తోమత లేకపోవడం వల్ల కొడుకును చూసుకునే బాధ్యతను బాలికకు అప్పగించాడు. ఇళ్లలో పనులకు పంపి బాలిక ద్వారా డబ్బులు సంపాదించేవాడు. కొన్నినెలల క్రితం డిసౌజా దంపతులు.. అంధేరి ప్రాంతంలోని ఇంటికి మారారు. సరిగ్గా అదే ప్రాంతంలో చిన్నప్పుడు పూజ తన కుటుంబంతో పాటు నివసించింది. బాలిక పెద్దది కావడం వల్ల ఆమెను ఎవరూ గుర్తించలేరని డిసౌజా భావించాడు. బాలిక ఇళ్లలో పనులకు వెళ్లినప్పుడు అదే ప్రాంతంలో ఇళ్లలో పనిచేసే 35 ఏళ్ల మహిళ.. ప్రమీలా దేవేంద్రతో పరిచయం అయ్యింది. తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని వారు తన అసలు తల్లిదండ్రులు కారని ప్రమీలకు బాలిక చెప్పింది. ఇంటర్నెట్‌లో బాలిక అదృశ్యంపై శోధించిన ప్రమీలకు.. పూజ అనే బాలిక కిడ్నాప్‌ వార్తలు కనిపించాయి. పనులు చేస్తున్న బాలికే పూజ అనే అనుమానంతో ప్రమీల డీఎన్‌ నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు.. పూజ గురించి ఆరా తీశారు. విశ్రాంత అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర భోస్లే పోలీసులకు అప్పటి కేసు వివరాలను అందించడం వల్ల కేసును చేధించడం తేలికైంది. హారీ డిసౌజా దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు పూజను ఎత్తుకొచ్చినట్లు అంగీకరించారు. డిసౌజా, అతడి భార్య సోనీలను అరెస్ట్‌ చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడేళ్ల వయసులో కనిపించకుండా పోయిన బాలిక 16 ఏళ్ల వయసులో తిరిగి రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని