కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ పెంపు

కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

Published : 08 Oct 2022 04:05 IST

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. దీనిపై జరిగిన చర్చలో విపక్షనేత సిద్ధరామయ్య, జేడీఎస్‌ నేత కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ను పెంచాలని జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్‌ను 17%కు, ఎస్టీలకు ఉన్న 3% రిజర్వేషన్‌ను 7%కు పెంచాలన్న కమిషన్‌ సిఫార్సులను ఆమోదిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. శనివారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీలకు 32, ఎస్సీలకు 15, ఎస్టీలకు 3% రిజర్వేషన్లు ఉన్నాయి.

సర్కారుపై ఒత్తిడి
2020లో జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా ఆమోదించలేకపోయామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి మించకూడదు. రాష్ట్రాల భౌగోళిక, సామాజిక పరిస్థితుల ప్రత్యేకతలకు అనుగుణంగా షెడ్యూల్‌ 9- ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ను పెంచే వీలుందన్నారు. తమిళనాడులో ఈ వెసులుబాటును వినియోగించుకుంటున్నట్లు ఆయన గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని