Hardeep Singh Puri: రష్యా చమురుపై ప్రశ్న.. ఘాటుగా బదులిచ్చిన కేంద్రమంత్రి

రష్యా చమురు కొనుగోలు విషయంలో తమ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మొదటి నుంచి భారత్‌ తన వాదన వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి మరోసారి స్పష్టం చేశారు.

Updated : 01 Nov 2022 19:38 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత్‌ ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. దీనిపై ఎలాంటి నైతిక ఘర్షణ లేదని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఈ చమురు కొనుగోలు చేయకపోతే.. ధరలు పెరుగుతాయని అబుదాబిలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  

‘మేం మా వినియోగదారులకు మాత్రమే నైతిక బాధ్యత వహిస్తాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మాది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్‌ తన అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి నైతిక ఘర్షణ లేదు. మేము చమురు అందుబాటులో ఉన్న దేశాల నుంచి కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం ఆ పని చేయకపోతే.. సంస్థలు చేస్తాయి’ అని వెల్లడించారు.

‘భారత్‌కు చమురు ఎగుమతి చేస్తోన్న దేశాల్లో రష్యా నాలుగు లేక ఐదు స్థానాల్లో ఉంటుంది. ఈ విషయంలో గత నెల ఇరాక్‌ మొదటిస్థానంలో ఉంది. ఎవరూ రష్యా చమురు కొనుగోలు చేయకపోతే.. ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగితే.. ద్రవ్యోల్బణం ఆ తర్వాత మాంద్యం ముంచుకొస్తుంది’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించమని అమెరికా లేక యూరోపియన్ యూనియన్ భారత్‌ను కోరితే..? అని ఆ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆ ప్రశ్నను అమెరికా లేక యూనియన్‌ను అడగండి’ అని కాస్త ఘాటుగా బదులిచ్చారు. 

యుద్ధం వేళ పుతిన్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే తరహాలో రష్యా చమురు ధరలపై పరిమితులు విధించడం గురించి జీ7 దేశాలు మాట్లాడుతున్నాయి. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. అయితే అలాంటి ప్రతిపాదన ఉంటే.. భారత్ పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు. చమురు కొనుగోలు విషయంలో తమ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మొదటి నుంచి భారత్‌ తన వాదన వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని