Haryana: శాంతించిన కర్నాల్.. ధర్నాను విరమించుకున్న రైతులు
తమపై లాఠీఛార్జ్ చేయించిన ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని హరియాణా రైతులు చేస్తున్న డిమాండ్లపై ప్రతిష్టంభన తొలగింది.
కర్నాల్: తమపై లాఠీఛార్జ్ చేయించిన ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని హరియాణా రైతులు చేస్తున్న డిమాండ్లపై ప్రతిష్టంభన తొలగింది. నాలుగో విడత చర్చల సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల డిమాండ్లను అంగీకరించడంతో కర్నాల్లో చేపట్టిన ధర్నాను రైతులు విరమించుకున్నారు. ఆగస్టు 28న జరిగిన కర్నాల్ లాఠీఛార్జ్ ఘటనలో ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హా పాత్రపై విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం రైతు సంఘాల నాయకులకు తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు సిన్హా విధులకు హాజరు కావొద్దని పేర్కొంటూ సెలవుపై పంపింది. లాఠీఛార్జ్ ఘటనలో చనిపోయిన సుశీల్ కాజల్ కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేసిన నేపథ్యంలో అతడి కుటుంబంలోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
సమావేశం ముగిసిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేందర్ సింగ్, రైతు నాయకుడు గురునామ్ సింగ్ చాదునీ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నాల్లో చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘లాఠీఛార్జ్ ఘటనకు కారణమైన ఐఏఎస్ అధికారిపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ద్వారా విచారణ చేయించాలనే మా డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’’ అని చాదునీ తెలిపారు. ‘‘రైతులు మా సోదరులు. వారి డిమాండ్లను పరిష్కారించడానికి అన్ని విధాల కృషి చేస్తాం’’ అని ఐఏఎస్ అధికారి దేవేందర్ సింగ్ పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం..
ఆగస్టు 28న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఓ సమావేశంలో పాల్గొనడానికి కర్నాల్ వెళ్లారు. తమ సమస్యలు పరిష్కరించమంటూ, కేంద్రప్రభుత్వం చేసిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు రైతులు మరణించగా, కొందరు గాయపడ్డారు. అదే సమయంలో కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా ఉన్న ఆయుష్ సిన్హా ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వాళ్ల తలలు పగలగొట్టండి’ అంటూ రైతులనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఆజ్ఞలు జారీ చేశారు. ఇదంతా కెమెరాల్లో రికార్డైంది. వీడియో బయటికి రావడంతో సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలక స్థానంలో ఉన్న అధికారి సంయమనం కోల్పోయి అలా మాట్లాడటం ఏంటని అంతా విరుచుకుపడ్డారు. కలెక్టర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రైతులు అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నెలరోజులు గడిచినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. కలెక్టర్ను డిస్మిస్ చేయకపోతే సింఘు, టిక్రీ సరిహద్దుల్లో నిరవధిక రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు చేపడతామని రైతు ఉద్యమ నేత నేత రాకేష్ టికాయిత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తాత్కాలికంగా అతడిని విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది. అయితే, ఈ సంఘటనలో తమ రాజకీయాల కోసం ఆయనను బలిపశువును చేశారని కొందరు నెటిజన్లు అంతర్జాలంలో వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్