Siddaramaiah: కొత్త మంత్రులకు టార్గెట్స్‌ ఫిక్స్‌ చేసిన సీఎం సిద్ధరామయ్య!

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులకు సీఎం సిద్ధరామయ్య (Siddaramaih) టార్గెట్ ఇచ్చారు. ఈ మేరకు జరిగిన కేబినెట్‌ భేటీలో ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. 

Published : 29 May 2023 01:27 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఘన విజయం తర్వాత సిద్ధరామయ్య (Siddaramaiah) సీఎంగా, డీకే శివకుమార్‌ (DK Shivakumar) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పడు వారందరికీ సిద్ధరామయ్య లక్ష్యాలను నిర్దేశించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 20 స్థానాల్లో గెలుపొందేలా కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం సిద్ధరామయ్య దిశానిర్దేశం చేశారు. 

‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కనీసం 20 స్థానాలు గెలుపొంది పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా ఇవ్వాలి. ప్రతి మంత్రి తమ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని గెలుపే లక్ష్యంగా నిజాయితీతో పనిచేయాలి. గతంలో చేసిన తప్పులను మరోసారి చేయొద్దు’’ అని సిద్ధూ మంత్రులతో చెప్పినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మంత్రులకు శాఖల కేటాయిస్తామని సిద్ధరామయ్య చెప్పారు. మంత్రులు తరచుగా తమ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అధికారులపై గట్టి నిఘా ఉంచాలని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు. గత నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని