Rajnath Singh: పాక్‌కు రక్షణశాఖ మంత్రి హెచ్చరిక..!

పాక్‌ ఆధీనంలోని గిల్గిట్‌ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకొంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. ఆర్మీ ఇన్‌ఫాంట్రీ డే సందర్భంగా ఆయన నేడు శ్రీనగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

Published : 27 Oct 2022 15:37 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అరాచకాలు జరుగుతున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆయన శ్రీనగర్‌లో నిర్వహించిన ‘శౌర్య దివస్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పాక్‌ ఈ అరాచకాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు.  జమ్ముకశ్మీర్‌, లద్ధాక్‌ల్లో అభివృద్ధి లక్ష్యాలు గిల్గిట్‌-బల్టిస్థాన్‌ల స్వాధీనంతోనే పూర్తవుతాయని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. ఉగ్రవాదానికి మతం అనేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌పై గురిపెట్టడమే ఉగ్రవాదుల లక్ష్యమని తెలిపారు. కేంద్రం ఆర్టికల్‌ 370ని తొలగించడంతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా భారత సైన్యం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కూడా పాల్గొన్నారు. 

భారత్‌ భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్‌ 27 సైన్యం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్‌ అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. దీనిని పురస్కరించుకొని ఆర్మీ ‘ఇన్‌ఫాంట్రీ డే’ను జరుపుకొంటుంది. మరోవైపు ఆ యుద్ధంలో వాయుసేన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్‌ అయింది కూడా అక్టోబర్‌27నే. ఈ నేపథ్యంలో సైన్యం, వాయుసేన కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకొంటున్నాయి. శ్రీనగర్‌లో వాయుసేన బేస్‌ ఏర్పాటు చేసి నేటితో 50 ఏళ్లు  పూర్తయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని