Vande Bharat: 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్‌పుర్‌, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు

కాచిగూడ- యశ్వంత్‌పుర్‌, విజయవాడ- చెన్నై మధ్య వందే భారత్‌ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Updated : 24 Sep 2023 14:25 IST

దిల్లీ: భారతీయ రైల్వేలో (Indian Railways) అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్‌ (Vande Bharat) రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 25 రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో తొమ్మిది రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వీటిని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (KACHEGUDA- YESVANTPUR JN), విజయవాడ-చెన్నై  (VIJAYAWADA-CHENNAI) మధ్య సర్వీసులందించే వందే భారత్‌ రైళ్లు కూడా ఉన్నాయి.

కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జెండా ఊపి వందే భారత్‌ రైలును ప్రారంభించారు. కాగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పలు నగరాల మధ్య ఈ తొమ్మిది రైళ్లు సర్వీసులందించనున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. వందే భారత్‌ రైళ్లకు ఆదరణ పెరుగుతోందన్నారు. రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు.

‘పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యంత అనువైన ప్రయాణ సాధనం భారతీయ రైళ్లు. 140కోట్ల మంది భారతీయుల ఆశలకు అనుగుణంగా వేగవంతమైన, భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వందే భారత్‌ రైళ్లకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. 1.11కోట్ల మంది ప్రయాణికులు ఇప్పటికే వీటిలో ప్రయాణించారు. ప్రస్తుతం 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తుండగా.. మరో తొమ్మిది కొత్తగా చేరాయి. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదు. సరికొత్త భారత్‌ విజయాలను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. 

కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, చెన్నై- విజయవాడ టికెట్‌ ధరలివే..!

చంద్రయాన్‌-3 విజయవంతంతో సామాన్యుడి అంచనాలు కూడా పెరిగాయి. మహిళల సారథ్యంలో పలు రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధిని యావత్‌ ప్రపంచం ప్రశంసిస్తోంది. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లను తీసుకువచ్చాం. రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరం’ అని ప్రధాని మోది పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని