Jahangirpuri demolition: ‘మేం ఆదేశించిన తర్వాత కూడా కూల్చివేతలా..?’

రాజధాని నగరంలోని జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌లో స్థానిక అధికారులు వ్యవహరించిన తీరును గురువారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది

Published : 21 Apr 2022 13:13 IST

తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించిన సుప్రీం

దిల్లీ: రాజధాని నగరంలోని జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌లో స్థానిక అధికారులు వ్యవహరించిన తీరును గురువారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కూల్చివేత ప్రక్రియను నిలిపివేయమని ఆదేశించిన తర్వాత కూడా దానిని కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ‘సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేయర్‌కు తెలియజేసిన తర్వాత జరిగిన అన్ని కూల్చివేతలను మేం తీవ్రంగా పరిగణిస్తాం. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలి’ అంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల ఘర్షణలతో అట్టుడికిన దిల్లీ జహంగీర్‌పురి ప్రాంతంలో బుధవారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉత్తర దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) హడావుడిగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టడం కలకలం రేపింది. బుల్డోజర్లను ఉపయోగిస్తూ కొన్ని నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేయగా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము గురువారం విచారణ చేపడతామని.. అప్పటి వరకు యథాతథస్థితిని కొనసాగించాలని నిర్దేశించింది. అయినా, గంటన్నర వరకు అక్కడ కూల్చివేతలు ఆగలేదు. న్యాయస్థానం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు అందకపోవడమే అందుకు కారణమని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఆ విషయాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రస్తావించారు. వెంటనే స్పందించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. కూల్చివేతలను ఆపాల్సిందిగా తాము ఆదేశించిన సంగతిని సంబంధిత అధికారులకు సత్వరం తెలియజేయాలని కోర్టు సెక్రటరీ జనరల్‌కు సూచించారు. అనంతరం డ్రైవ్‌ను నిలిపివేసినట్లు ఎన్‌డీఎంసీ మేయర్‌ రాజా ఇక్బాల్‌సింగ్‌ తెలిపారు.  

ఇదిలా ఉండగా..విచారణలో భాగంగా పిటిషనర్లు కోర్టులో తమ వాదనలు వినిపించారు. తాము పత్రాలు చూపించినా కూల్చివేత ఆపలేదని, తమను లక్ష్యంగా చేసుకొన్నారని ఆరోపించారు. మరోపక్క తాము చిన్నపాటి నిర్మాణాలను మాత్రమే తొలగించామని స్థానిక యంత్రాంగం వాదించగా.. దానికి బుల్డోజర్లు ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ కూల్చివేతలపై మున్సిపల్ కార్పొరేషన్, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని