బెజోస్‌ వ్యోమనౌక వెనుక.. భారత యువతి

కొద్ది రోజుల క్రితం తెలుగు యువతి శిరీష బండ్ల అంతరిక్షయానం చేసి అరుదైన రికార్డు సృష్టించారు. వర్జిక్‌ గెలాక్టిక్‌ చేపట్టిన యాత్రలో భాగంగా శిరీష రోదసిలోకి వెళ్లొచ్చి

Published : 17 Jul 2021 17:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్ది రోజుల క్రితం తెలుగు యువతి శిరీష బండ్ల అంతరిక్షయానం చేసి అరుదైన రికార్డు సృష్టించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపట్టిన యాత్రలో భాగంగా శిరీష రోదసిలోకి వెళ్లొచ్చి అంతరిక్ష రంగంలో భారత నారీమణుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పారు. తాజాగా ఈ జాబితాలో మరో దేశీయ యువతి చేరారు. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ త్వరలో ప్రయాణించే వ్యోమనౌక  ‘న్యూ షెపర్డ్‌’ అభివృద్ధిలో మరాఠా అమ్మాయి సంజల్‌ గవాండే కీలక పాత్ర పోషించారు.  ఇంతకీ ఎవరీ సంజల్‌..? మహారాష్ట్ర నుంచి బ్లూ ఆరిజిన్‌ వరకు ఎలా వెళ్లారు..? 

ఈ నెల 20వ తేదీన తన బ్లూ ఆరిజిన్‌ సంస్థ ద్వారా బెజోస్‌ అంతరిక్ష యానం చేయనున్నారు. తనతో పాటు మరో ముగ్గురిని రోదసిలో తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకను సంస్థ అభివృద్ధి చేసింది. ఈ బృందంలో సంజల్‌ గవాండే కూడా సభ్యురాలు. బ్లూ ఆరిజిన్‌లో సిస్టమ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సంజల్.. న్యూ షెపర్డ్‌ తయారీలో కీలక పాత్ర పోషించారు. 

సంజల్‌ స్వస్థలం.. మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతంలో గల కోల్సేవాడి. తండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి. ముంబయి యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీర్‌ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మాస్టర్స్‌ చదివేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్‌ టెక్నోలాజిక్‌ యూనివర్సిటీలో చేరారు. అంతరిక్ష వ్యవహారాలపై ఆసక్తితో ‘ఏరోస్పేస్‌’ సబ్జెక్ట్‌ను ఎంచుకుని ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. మాస్టర్స్‌ పూర్తిచేసిన తర్వాత విస్కన్సిస్‌లోని మెర్క్యురీ మెరైన్‌ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత టయోటా రేసింగ్‌ డెవలప్‌మెంట్‌లో చేరారు.

ఈ మధ్యలోనే కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కూడా పొందారు. నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. ఆ తర్వాత బ్లూ ఆరిజన్‌లో సిస్టమ్‌ ఇంజినీర్‌గా చేరారు. తాజాగా బెజోస్‌ అంతరిక్షయానంలో భాగస్వామి అవడమేగాక, న్యూ షెపర్డ్‌ వ్యోమనౌక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని