
US: ఒమిక్రాన్ భయాలు.. అమెరికా ప్రయాణ నిబంధనలు మరింత కఠినతరం
వాషింగ్టన్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ విజృంభణ దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షల నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేయనుంది. అమెరికాకు వచ్చే ప్రయాణికులు.. జర్నీకి ఒక్కరోజు ముందుగానే వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా నిబంధనలు తీసుకురానున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. ప్రస్తుతం ఈ గడువు మూడురోజులు(72 గంటలు)గా ఉంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి, తీసుకున్నవారి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
తాజా నిబంధనలపై సీడీసీ డైరెక్టర్ డా.రోచెల్ వాలెన్స్కీ మాట్లాడారు. ‘ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ టెస్టింగ్ విధానంలో మార్పులు చేసేందుకు సీడీసీ యత్నిస్తోంది. నూతన నిబంధనలతో వైరస్ నిర్ధరణ పరీక్షల సమయం తగ్గనుంది. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎలా సురక్షితం చేయాలన్నదానిపై.. క్వారంటైన్ విధానంపైనా సీడీసీ సమీక్షిస్తోంది’ అని తెలిపారు. విదేశీ ప్రయాణికులు అమెరికాకు వచ్చాక వారికి స్థానికంగా కరోనా పరీక్షలు నిర్వహించడంపైనా దృష్టి సారిస్తున్నామని రోచెల్ పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధన ప్రకారం అమెరికాకు వచ్చిన ప్రయాణికులు 3-5 రోజుల తర్వాత కొవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నవారు అమెరికాకు వచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం గత నెలలోనే అనుమతులు ఇచ్చింది.
► Read latest National - International News and Telugu News