30 ఏళ్లు శ్రమించి.. ఊరికి రోడ్డేశాడు!

అదో మారుమూల గిరిజన గ్రామం. నగరానికి దూరంగా విసిరి పారేసినట్లు ఉంటుంది. కనీసం మట్టి రోడ్డు కూడా లేని ఆ ఊరికు వెళ్లాలంటే అడవిని దాటాల్సిందే....

Published : 06 Aug 2021 22:55 IST

నయాగఢ్: అదో మారుమూల గిరిజన గ్రామం. నగరానికి దూరంగా విసిరి పారేసినట్లు ఉంటుంది. కనీసం మట్టి రోడ్డు కూడా లేని ఆ ఊరికి వెళ్లాలంటే అడవిని దాటాల్సిందే. తెలియనివారైతే.. ఆ కారడవిలో తప్పిపోతుంటారు కూడా. ఆ గ్రామాన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ దుస్థితిని గుర్తించిన ఓ వ్యక్తి రోడ్డు నిర్మించాలని భీష్మించుకున్నాడు. 30 ఏళ్లు శ్రమించి రోడ్డును నిర్మించాడు.

ఒడిశాలోని నయాగఢ్​ జిల్లా బంతపుర్​ పంచాయతీ పరిధిలో ఉంటుంది తులుబి గ్రామం. తమ గ్రామానికి రోడ్డు లేదని, సమస్య తీర్చాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆ గ్రామానికి చెందిన హరిహర్​​ బెహరా తన సోదరుడి సాయంతో రోడ్డు నిర్మించాలన్న మహత్తర కార్యానికి నడుం బిగించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున్న ఎత్తయిన ప్రాంతంలోని రాళ్లు, చెట్లు, పొదలను తొలగించి.. పెద్ద వాహనాలు సైతం ఆ గ్రామానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యం ఈ మధ్యే ముగిసింది. ఇప్పుడు ఆ మార్గంలో కాలినడకలే కాదు.. వాహనాల రాకపోకలు కూడా సులువుగా సాగుతున్నాయి.

‘‘గతంలో మా ఊరికి రోడ్డు లేదు. పట్టణానికి వెళ్లాలంటే ఎంతో శ్రమించేవాళ్లం. రహదారి నిర్మించాలని స్థానిక నేతలకు విజ్ఞప్తి చేశాం. అందుకు కుదరదని సమాధానమిచ్చారు. ఆ రోజు నుంచే రోడ్డు నిర్మించడం ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఈ రోడ్డును చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మా ఈ పనిని చూసేందుకు వేరే గ్రామాలవారు కూడా వస్తున్నారు’’ అని హరిహర్‌ బెహరా ఆనందం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని