Tollywood Movies: తారుమారు అయ్యాయి!

ఓ అగ్ర కథానాయకుడు, ఓ అగ్ర దర్శకుడు కలిసి ఓ కొత్త చిత్రం ప్రకటించడమే ఆలస్యం సినీ అభిమానుల్లో సందడి మొదలవుతుంది. ఆ కాంబినేషన్‌పై మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? నాయిక ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటిలానే ఇటీవల మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ విషయంలోనూ ఇదే జరిగింది.

Published : 29 May 2021 10:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ అగ్ర కథానాయకుడు, ఓ అగ్ర దర్శకుడు కలిసి కొత్త చిత్రం ప్రకటించడమే ఆలస్యం సినీ అభిమానుల్లో సందడి మొదలవుతుంది. ఆ కాంబినేషన్‌పై మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? నాయిక ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటిలానే ఇటీవల మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ చిన్న మార్పు చోటు చేసుకుంది. అదేంటంటే.. ముందుగా ప్రటించిన సినిమాని కాస్త వెనక్కి పెట్టి మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. అభిమానులకి బాగా రిజిస్టర్‌ అయిన వర్కింగ్‌ టైటిల్‌తో మరో దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించనున్నారు.

మహేశ్‌ బాబు 27, 28..

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్‌ బాబు ‘SSMB 27’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం చేయాల్సి ఉంది. అంతా ఓకే అయినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అదే వర్కింగ్‌ టైటిల్‌తో పరశురామ్‌- మహేశ్‌ కాంబోలో ఓ చిత్రం ఖరారైంది. అదే ‘సర్కారు వారి పాట’. ఇది పూర్తయిన వెంటనే మహేశ్‌ తదుపరి చిత్రం ‘‘SSMB 28’ రాజమౌళి దర్శకత్వంలోనే టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇప్పుడది త్రివిక్రమ్‌ ఖాతాలోకి వెళ్లింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తను నటిస్తున్నట్టు మహేశ్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. వంశీ పైడిపల్లి, రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్‌ 30..

గతేడాది ప్రకటించిన చిత్రాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది ‘ఎన్టీఆర్‌ 30’ (వర్కింగ్‌ టైటిల్‌). ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ ప్రకటించిన సినిమా ఇది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నా కొవిడ్‌, తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఆ వర్కింగ్‌ టైటిల్‌తో  కొరటాల శివ తెరపైకి వచ్చారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత మరోసారి కలిశాం అంటూ ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్రివిక్రమ్‌.. మహేశ్‌ బాబుతో చిత్రం పూర్తయ్యాక తారక్‌తో చేసే అవకాశాలున్నాయి.

అల్లు అర్జున్‌ 21..

‘ఏఏ 21’ వర్కింగ్‌ టైటిల్‌తో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా కొరటాల శివ ఓ చిత్రం ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేస్తుండటంతో ‘ఏఏ 21’ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ‘అవన్నీ అవాస్తవం.. కచ్చితంగా ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది’ అని చిత్ర బృందం వెల్లడించింది. ఇదిలా ఉంటే బన్నితో ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురగదాస్‌తో కథా చర్చలు జరుపుతున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఓకే అయితే ‘ఏఏ 21’కి దర్శకుడు మురగదాస్‌ అవుతారు.  ‘ఏఏ 22’కి దర్శకుడిగా కొరటాల నిలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని