
ఫడణవిస్ను ట్రోల్ చేయడం సరికాదు: శివసేన
ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్పై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారని అభినందించింది. కొవిడ్-19 సోకితే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరతానని ఆయన చెప్పడం ప్రచారం కోసం కాదని తెలిపింది.
ప్రభుత్వ వైద్య సదుపాయాలు, యంత్రాంగంపై ఫడణవిస్ సంతృప్తి వ్యక్తం చేశారని సామ్నా పత్రికలో శివసేన పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వానికీ, రోగులకీ, సిబ్బందికీ ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయని వెల్లడించింది. ‘యువ నాయకుడు, ప్రతిపక్ష నేతగా దేవేంద్ర ఫడణవిస్ డైనమిక్ అనడంలో సందేహం లేదు. తనకు కరోనా పాజిటివ్ వస్తే చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తానని వారి పార్టీనేతలతో అన్నట్టు తెలిసింది’ అని సామ్నా తెలిపింది.
‘ఇలా మాట్లాడినందుకు ఫడణవిస్ను నిజానికి అభినందించాలి. కానీ ట్రోలింగ్ చేస్తున్నారు. అది సరికాదు. ప్రతిపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లు సమర్థంగా వ్యవహరిస్తున్నారని మేం ఎన్నోసార్లు చెప్పాం. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరతానని చెప్పడం స్టంట్ కాదు. ఏమన్నా జరిగితే తనను రక్షిస్తారని ప్రభుత్వ వైద్యం, యంత్రాంగంపై ఆయనకున్న ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఆయన మాటలు వైరస్పై పోరాడేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందికి ఆత్మవిశ్వాసం నింపాయి. అందుకు ఆయన్ను అభినందించాలి’ అని సామ్నా పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.