మోదీజీ.. ఇచ్చిన హామీలను మరిచిపోవద్దు: తేజస్వి

బిహార్‌ ప్రతిపక్ష నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో మీరిచ్చిన హామీలను మరిచిపోవద్దని ప్రధానిని కోరారు...

Published : 03 Nov 2020 16:16 IST

ప్రధానికి లేఖ రాసిన మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి

 

పాట్న: బిహార్‌ ప్రతిపక్ష నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో మీరిచ్చిన హామీలను మరిచిపోవద్దని ప్రధానిని కోరారు. 2015తోపాటు తాజా ఎన్నికల సమయంలో బిహార్‌ ప్రజలకు అనేక హామీలిచ్చారని వాటిని నెరవేర్చాలని కోరారు. హిందీలో రెండు పేజీల్లో ఉన్న లేఖను ఆర్జేడీ నేత ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘గత ఆరేళ్లుగా బిహార్‌ ప్రజలకు ఇస్తున్న హామీలను మర్చిపోలేదనే అనుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను లేఖలో గుర్తుచేశారు.

‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చట్టాలు అనుకూలించడంలేదనే సాకును ఇంకెన్నాళ్లు చెబుతారు? 40కి 39 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రం కోసం చట్టాలను సవరించలేరా? అని తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలో పడ్డ కష్టాలు వర్ణనాతీతమని, వారి కష్టాలను దూరం చేసేందుకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. పాట్నా విశ్వవిద్యాలయానికి కేంద్ర హోదాతోపాటు పలు హామీలను గుర్తుచేశారు. వాటిని విస్మరించొద్దని పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని