లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేస్తామని చెప్పలేదే!

ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేసేందుకు తాను సుముఖంగా లేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థల మధ్య సమతూకం...

Published : 25 Jul 2020 15:00 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే

ముంబయి: ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేసేందుకు తాను సుముఖంగా లేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థల మధ్య సమతూకం సాధించడం అవసరమని పేర్కొన్నారు. శివసేన పార్టీ అధికార పత్రికతో ఆయన మాట్లాడారు.

‘పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తానని నేనెప్పుడూ అనలేదు. కొద్దికొద్దిగా తెరుద్దామని చెప్పాను. ఒకసారి తెరిచాక మళ్లీ మూసేయొద్దన్నది నా ఉద్దేశం. దశలవారీగా వ్యాపారాలను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థా, ఆరోగ్యమా అని ఆలోచించకూడదు. రెండింటి మధ్య సమతూకం అవసరం. ఈ మహమ్మారి ప్రపంచ యుద్ధంలాంటిది. అన్ని దేశాలూ దీని బారిన పడ్డాయి. వైరస్‌ ప్రభావం పోయిందని ఆర్థిక వ్యవస్థలు తెరిచిన దేశాలు ఇప్పుడు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సైన్యాన్ని రంగంలోకి దించారు’ అని ఉద్దవ్‌ అన్నారు.

‘చాలామంది లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని అంటున్నారు. వారిని నేనొక్కటే ప్రశ్న అడుగుతున్నాను. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ప్రజలు చనిపోతే వారు బాధ్యత వహిస్తారా? ఆర్థిక వ్యవస్థపైన మాకూ బాధేస్తోంది’ అని అన్నారు. ముంబయిలో సబర్బన్‌ రైల్వే నెట్‌వర్క్‌ పునః ప్రారంభం గురించి ప్రశ్నించగా ‘వారి కుటుంబాలు అస్వస్థతకు గురై ఇళ్లన్నీ తాళం వేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అందుకే ప్రతిదీ దశలవారీగా చేయాలంటున్నాం’ అని పేర్కొన్నారు. మహావికాస్‌ అఘాడి ప్రభుత్వ సవాళ్లు, ప్రతిపక్షాల గురించి ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని