Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే

భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Updated : 19 Mar 2024 15:40 IST

దిల్లీ: దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అన్నారు. లోక్‌సభ ఎన్నికల (LokSabha Elections 2024) కోసం మేనిఫెస్టోపై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమైంది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశంలోని అన్ని గ్రామాల్లో, నగరాల్లో ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

‘‘దేశం మార్పును కోరుకుంటోంది. భారత్‌ వెలిగిపోతోందంటూ 2004లో భాజపా ప్రచారం చేసింది. అప్పుడు ఏం జరిగిందో.. ఇప్పుడు అవే ఫలితాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అప్పటి గతే పడుతుంది. పార్టీ మేనిఫెస్టోకు విస్తృత ప్రచారం కల్పించడం మన బాధ్యత. దేశంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్‌ మేనిఫెస్టో చేరువకావాలి. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ అమలు చేస్తుంది’’ అని ఖర్గే తెలిపారు. 

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భారత్‌ జోడో న్యాయ్ యాత్రతో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ‘‘రాహుల్‌ చేసింది కేవలం రాజకీయ యాత్ర కాదు. ఇలాంటిది ఇంతకముందు ఏ నాయకుడు చేయలేదు. రెండు యాత్రలతో దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి’’ అని సీడబ్ల్యూసీ భేటీలో అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌తోపాటు ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. మహిళల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే  ‘నారీ న్యాయ్‌’ పేరుతో ఐదు హామీలను ప్రకటించింది. మరోవైపు అధికారంలోకి రాగానే పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చింది. ఇదే కాకుండా ‘కిసాన్‌ న్యాయ్‌’ పేరిట ఐదు హామీలు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని