Manjummel Boys: ఓటీటీలోకి ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 27 Apr 2024 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. ఇటీవల విడుదలైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ తెలుగులోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా మే5 నుంచి ప్రసారం కానుంది. 2006లో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని చిదంబరం దీనిని తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

క‌థేంటంటే: కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు స్నేహితులంద‌రూ సొంత ఊళ్లోనే చిన్నాచిత‌కా ఉద్యోగాలు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ ఉంటుంది. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. ఈ విహార‌యాత్ర‌కు సుభాష్ తొలుత రాన‌ని చెప్పినా.. కుట్ట‌న్ బ‌ల‌వంతం మీద ఆఖ‌రి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమ్మ‌ల్ బ్యాచ్ కొడైకెనాల్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల‌న్నీ చూశాక ఆఖ‌రిలో గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. ఆ గుహ‌లు బ‌య‌ట నుంచి చూడ‌టానికి ఎంత ర‌మ‌ణీయంగా ఉంటాయో.. అంతే ప్ర‌మాద‌క‌రం కూడా. ఎందుకంటే అక్క‌డ వంద‌ల అడుగుల లోతున్న ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన లోయ‌లుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒక‌టి. దాదాపు 150 అడుగుల‌కు పైగా లోతున్న ఆ లోయ‌లో 13మందికి పైగా పడిపోయారు.. వీరిలో ఏ ఒక్క‌రూ ప్రాణాల‌తో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర లోయ‌లున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్ల‌డాన్ని అట‌వీశాఖ వారు.. పోలీసులు నిషేధించారు. కానీ, మంజుమ్మ‌ల్ బాయ్స్ అక్క‌డున్న అట‌వీ సిబ్బంది కళ్లుగ‌ప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశానికి వెళ్తారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాల‌తో కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులంతా ఏం చేశారు?  అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని